హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఉన్నది ఉన్నట్టు అంటే ఆంధ్రప్రదేశ్ నేతలకు ఉలుకు ఎందుకని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. ఎనిమిదేండ్ల్ల కాలంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తున్నదని, పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో కరెంట్ కోతలున్నాయని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రానాయకులు ఎందుకు హైరానా పడుతున్నారో అర్థం కావటం లేదని అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమను ఏపీ నేతలు ప్రతిపక్షంగా భావిస్తున్నరా? అని ప్రశ్నించారు. ఏపీ తమ కంటే అభివృద్ధి చెందితే సంతోషిస్తామన్నారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో కరెంట్ కోతలున్నాయని పేర్కొనటంపై మండిపడ్డారు. రాష్ట్రంలో జనరేటర్లు.. ఇన్వర్టర్లు లేనేలేవని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు అవుతున్నాయని, కరెంట్ కోతల్లేని రాష్ట్రంగా దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. కరెంట్ లేదని హైదరాబాద్లో ఉన్నవాళ్లను అడిగి తెలుసుకుంటే మంచిదని సూచించారు.