హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగబోతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ వైపు, సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. దేశ ప్రజలు తెలంగాణ మాడల్ను కోరుకొంటున్నారని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. దేశ రైతాంగాన్ని ఏకంచేయడానికి సీఎం కేసీఆర్ ప్రయ త్నం చేస్తున్నారని, ఇందులో ఆయన సఫలమవుతారని తెలిపారు.
కిసాన్ సంఘటన్ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశంపై పల్లా స్పందిస్తూ.. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఆశిస్తున్నారని చెప్పారు. దసరాకల్లా భారత రాష్ట్ర సమితి ప్రకటన వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. చేతకాని బీజేపీని, చేవ చచ్చిన కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఇటీవలే 3 రోజులపాటు దేశంలోని వివిధ రాష్ర్టాల రైతు నేత లు రాష్ట్రంలో పర్యటించి ఇక్కడ పథకాలు, అమలు తీరును పరిశీలించి అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. తామంతా కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తామని రైతు సంఘాల నేతలు చెప్పినట్టు తెలిపారు.
ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్ర
దేశంలో బీజేపీ తప్ప మరో పార్టీ అధికారంలో ఉం డొద్దని మోదీ కుట్ర చేస్తున్నారని పల్లా ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆయా రాష్ర్టాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీకి కర్రుకాల్చి వాతపెట్టారని అన్నారు. తెలంగాణలోనూ మూడు తోకలతో కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నదన్నారు.
సైనికులకు సాయం చేస్తే తప్పా?
గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన భారత సైనికుల కుటుంబాలకు తెలంగాణ తరఫున ఆర్థికసాయం చేయడంపై బీజేపీ, కాంగ్రె స్ నేతల విమర్శలపై పల్లా ఘాటుగా స్పందించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనికుల సాయంపై విమర్శలు చేయడం వారి కురుచ బుద్ధి కి నిదర్శనమన్నారు. సైనికులకు ఎక్కువ సాయం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు.
బీహార్ ప్రజలు మెచ్చుకున్నారు
కేసీఆర్, నితీశ్కుమార్ ప్రెస్మీట్ సందర్భంగా జరిగిన వాస్తవమేమిటో తెలియకుండా బీజేపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని, సోషల్ మీడియాలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాటలు విని అక్కడి ప్రజలు, అధికారులు, మీడియా ప్రతినిధులు మెచ్చుకున్నారని చెప్పారు. గురుద్వార్లో మత పెద్దల సూచన మేరకు సీ ఎం కేసీఆర్ తలపాగా పెట్టుకున్నారని తెలిపారు. అంతేగానీ ప్రధాని మోదీ మాదిరిగా ముందే అన్ని ఏర్పాటు చేసుకొని, నాటకాలు వేసే రకం కాదని తెలిపారు.
కార్పొరేట్లకు భూములు కట్టబెట్టే కుట్ర
ప్రధాని మోదీ దేశంలో వ్యవసాయాన్ని పూర్తిగా బంద్ చేయించాలని కుట్ర పన్నుతున్నారని పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. రైతులను వ్యవసాయానికి దూరం చేసి.. వారి భూములను తక్కువ ధరకే అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. మోదీ కుట్రలను భగ్నం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. లేకుంటే దేశంలో వ్యవసాయం కనమరుగవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి కొత్త వ్యవసాయ విధానం, నీటి పారుదల విధానం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, పంట మొత్తం కొనుగోలు లాంటి విధానాలు కావాలని దేశం మొత్తం ముక్త కంఠంతో కోరుకుంటుందన్నారు.