జనగామ జిల్లా పెంబర్తిలో గురువారం లంకెబిందె దొరికింది. అందులో 18 తులాల 7 గ్రాముల బంగారం, కిలో 720 గ్రాముల వెండి, పగడాలు, రాగిపాత్ర లభ్యమయ్యాయి. భూ యజమానులు అధికారులకు సమాచారం ఇవ్వగానే వారొచ్చి గుప్తనిధిని తీసుకెళ్లారు. ఈ విషయం ఆనోటా.. ఈనోటా రాష్ట్రమంతా తెలిసింది. సంచలనంగా మారింది. ఇంతవరకు ఓకే! కానీ.. ఆ నిధిని ఏం చేస్తారు? భూ యజమానులకు ఇస్తారా? ప్రభుత్వ ఖజానాకే చెందుతుందా? ఆ నిధిపై భూయజమానులకు ఎలాంటి హక్కులు ఉండవా ? అనే అనుమానాలు అందరికీ వచ్చాయి. మరి ఇలాంటి గుప్త నిధుల గురించి చట్టం ఏం చెబుతుందనే విషయాలను ఓ సారి పరిశీలిస్తే..
భూమిలోపల దొరికిన ఎలాంటి నిధిపైనా ఎవరికీ హక్కులుండవు. అది వార సత్వ సంపద కింద ప్రభుతానికే చెందుతుంది. ఇందుకు సంబంధించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టంలో పలు నిబంధనలున్నాయి. భూమిలో పాతిపెట్టిన నిధి జాతి వారసత్వ సంపద అయితే.. ఆ సొమ్ముపై ఎవరికీ ఎలాంటి హక్కులు ఉండవు. దాన్ని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుంది.
బ్రిటిషర్లు దేశంలోని ఆలయాలు, రాజులు దాచిపెట్టిన నిధులు నిక్షేపాలపై మొదటి నుంచీ ప్రత్యేక కన్ను వేసిన సంగతి తెలిసిందే. ఆ నిధి కోసం వారు 1878లో ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ పేరిట చట్టం చేశారు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం దానికి కొన్ని మార్పు లు చేసింది. దానిప్రకారం ఏదైనా ఒక ప్రాంతంలో, లేదంటే భూమిలో నిధి నిక్షేపాలు లభ్యమైతే అదిఎవరికి చెందాలి? ఎంత వాటా పొందాలి? అన్న అంశాలపై స్పష్టతనిచ్చారు. ఇప్పుడు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అదే చట్టాన్ని అమలు చేస్తున్నది. లభ్యమైన గుప్తనిధులు చారిత్రక వారసత్వ సంపదకు చెందినవి (రాచరిక కాలానికి చెందినవి) అయితే.. రాతి ముక్కనుంచి.. రతనాల దాకా ఏమి దొరికినా.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకొంటుంది.
గుప్తనిధుల పంపకం ఒక పెద్ద తతంగమే. నిధి దొరికిందని సమాచారం రాగానే మొదట స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు ఆ నిధిని పంచనామా చేసి కలెక్టర్కు స్వాధీనపరుస్తారు. కలెక్టర్ అది వారసత్వ సంపదా? లేక పూర్వీకులు దాచి ఉంచినదా? అన్నది నిర్ధారిస్తారు. పూర్వీకులదైతే.. దాని వారసులెవరన్నదానిపై విచారించి సంపదను వాటాలుగా విభజించి పంచుతారు. లభించిన సొమ్ములో 1/5 వంతు భూ యజమానికి అప్పగిస్తారు. ఆ భూమిని యజమాని కాకుండా వేరొకరు సాగుచేస్తుంటే సదరు కౌలుదారులు, నిధిని వెలికితీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత వాటా దక్కుతుంది. గుప్తనిధి లభించిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా కాజేయాలని చూస్తే సదరు వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధిస్తారు.
ఇవి కూడా చదవండి..
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్లో అడ్రస్ మార్చడమెలా
క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
పాన్ కార్డు లో అడ్రస్ మార్చుకోవడం ఎలా
మీ ఆధార్ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా