హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఇంత జరిగినా అదే అహంకారం.. అదే అణచివేత ధోరణి.. దేశం దేశమే యువజనమంతా వీధుల్లోకి వచ్చి వేలెత్తి చూపుతున్నా.. వాస్తవాలను గుర్తించలేని దిక్కుమాలిన భావదారిద్య్రం.. జనం నమ్ముతారా? లేదా? అన్న కించిత్ జ్ఞానమైనా లేకుండా వాట్సప్ యూనివర్సిటీతో అబద్ధాల ప్రచారం. అత్యంత సహనశీలురైన భారతదేశ యువతకు ఇంత కోపం ఎందుకు వచ్చింది? సైన్యంలో చేరాలనే సదుద్దేశంతో రెండేండ్ల క్రితం దేశవ్యాప్తంగా లక్షలమంది, తెలంగాణ నుంచి దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకొన్నారు. వీరికి దేహ దారుఢ్య, ఆరోగ్య పరీక్షలు కూడా చేశారు. ఇక రాతపరీక్షే తరువాయి. ఈ సమయంలో 2021 మే 30 నుంచి నవంబర్ 20 మధ్య నాలుగుసార్లు ఈ పరీక్షను వాయిదా వేశారు. అనేకసార్లు అభ్యర్థులు బీజేపీ నేతలను, సైనికాధికారులను కలిసి పరీక్ష త్వరగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరేందుకు ప్రయత్నించారు. చివరకు ఇప్పుడు పరీక్షను రద్దుచేసి ఎంపికైన వాళ్లను రోడ్డున పడేయటంతో వాళ్లు రగిలిపోయారు. కానీ బీజేపీ చెప్తున్నదేమిటి? యువత ఆందోళన వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉన్నదని! ప్రధాని సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. మరి అక్కడ కుట్ర ఎవరిది? ఆ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నది కదా? ఈ అల్లర్లకు రాష్ర్టాల ఇంటెలిజెన్స్ వైఫల్యమే బాధ్యత అని బీజేపీ నేతలు అంటున్నారు. అల్లర్లు అధికంగా, తీవ్రంగా జరుగుతున్నది బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానాల్లోనే.. మరి అక్కడ బీజేపీ ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని కాషాయ పార్టీ నేతలు ఒప్పుకొంటారా? జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగి అనేకమంది సైనికులు చనిపోతే కేంద్రానిది వైఫల్యం కాదా? కానీ నిరుద్యోగ యువత అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తే ఇంటెలిజెన్స్ వైఫల్యమా?
ఆందోళన చేస్తున్నవారంతా దేశద్రోహులని బీజేపీ విమర్శిస్తున్నది. ఎవరిది దేశద్రోహం?సైనికుల త్యాగాలను స్వార్థ రాజకీయాలకోసం వాడుకొంటున్నవారిదా? సైన్యంలో చేరి నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తామంటున్నవారిదా? బీజేపీ ఇప్పటిదాకా సోషల్మీడియాను యాంటీ సోషల్ పనులకు వాడుకొని తమను వ్యతిరేకించే వారిపై బురదజల్లే పనులు చేస్తున్నది. ఎంతో మంది యువతను పెడమార్గం పట్టించింది. ఇప్పుడు అదే సోషల్మీడియాను వాడుకొని తమకు న్యాయం కావాలని యువత ఒక్కటైతున్నది. అయినా బీజేపీ సిగ్గులేకుండా వాస్తవాలను తొక్కిపెట్టి ఇతరులపై నెపం మోపే దుర్మార్గానికి ఒడిగడుతున్నది. సికింద్రాబాద్లో శుక్రవారం జరిగిన ఆందోళన వెనుక టీఆర్ఎస్ ఉన్నదని బీజేపీ నేతలంటున్నారు. మరి ఇతర రాష్ర్టాల్లో ఎవరున్నారు? ఎన్డీఏ అధికారంలో ఉన్న బీహార్లో బీజేపీ నేతల ఇండ్లపై కూడా దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అక్కడెవరి పాత్ర ఉన్నది?
శాంతిభద్రతల అంశం రాష్ర్టాల పరిధిలోనిది అని బీజేపీ నేతలంటున్నారు. రాష్ర్టాల నిఘా ఏం చేస్తున్నదని అంటున్నారు. కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నది కదా? దేశ నిఘా వ్యవస్థ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నది కదా? మరి దేశ నిఘా ఏం చేస్తున్నది? అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్నదని రాష్ర్టాలకు సమాచారం ఎందుకివ్వలేదు? అయినా, అగ్నిపథ్లాంటి అసాధారణ సంస్కరణ చేపట్టేముందు ఎవరినైనా సంప్రదించారా? ఏ ముఖ్యమంత్రికైనా తెలిపారా? నిరుద్యోగ యువత అభిప్రాయాలు తీసుకొన్నారా? మేధావులతో చర్చించారా? బాధ్యత మరిచి, అనాలోచిత నిర్ణయాలు తీసుకొంటూ ఇప్పటికే ప్రపంచం ముందు దేశానికి తలవంపులు తెచ్చి.. సిగ్గు లేకుండా ఆ పాపాన్ని ప్రతిపక్షాల మీద వేస్తారా? దేశద్రోహులని, అరాచక శక్తులని వాట్సప్ యూనివర్సిటీ ద్వారా ప్రతిపక్షాలను తూలనాడటం.. ఇదా దేశాన్ని పాలించే పార్టీ చేసే పని.. ఇంత నీచమా? అధికార పార్టీ నేతలే కుట్రలు చేయటం.. ఇదెక్కడి సంస్కృతి? ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? బీజేపీ అగ్రనేతలే అడ్డగోలుగా అబద్ధాలు చెప్తుంటే, ఇక రాష్ర్టాల్లో ఆ పార్టీ నేతలకు అడ్డు అదుపు ఉంటుందా?
ఇప్పుడు జరుగుతున్నదేమిటో దేశ ప్రజలకు తెలిసి వస్తున్నది. ఇప్పటికీ తెలియనివారు తెలుసుకొని తీరాలి. ధరల మంట ఎవరి వైఫల్యం? దేశ ఆర్థిక వెనుకబాటుతనం ఎవరి వైఫల్యం? రూపాయి పతనం ఎవరి వైఫల్యం? ద్రవ్యోల్బణం ఎవరి అజ్ఙానానికి నిదర్శనం? ప్రజలు ఇకనైనా గమనించాలి? ఇంత అడ్డగోలుగా వ్యవహరించే బీజేపీ ఈ దేశానికి అవసరమా? అనేది కూడా ఆలోచించాలి.
పెన్షన్ ఎగవేతకే ‘అగ్నిపథ్’!
రక్షణరంగ బడ్జెట్లో కోత పెట్టి అత్తెసరు నిధులు కేటాయిస్తున్న మోదీ ప్రభుత్వం.. అగ్నిపథం పేరుతో సైనిక శక్తితో ఆటలాడుతున్నదని రక్షణరంగ నిపుణులు విమర్శిస్తున్నారు? బడ్జెట్లో కోత, పెన్షన్ ఎగవేత కోసమే అగ్నివీరులను తెరపైకి తెచ్చారని విశ్లేషిస్తున్నారు. చైనా, పాకిస్థాన్ నుంచి సరిహద్దుల్లో సవాళ్లు ఎదురవుతున్న వేళ సైనిక శక్తిసామర్థ్యాలను కేంద్రం నిర్ణయం పలుచన చేస్తుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అటు దేశ యువతకు, ఇటు సైన్యానికి అగ్నిపథ్ చేటు చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రక్షణరంగంపై నిధుల కేటాయింపు తగ్గుతూ వస్తున్నది. దానికితోడు మాజీ సైనికుల పెన్షన్ను కేంద్రం గుదిబండలా భావిస్తున్నది. ఆ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు అనేక ప్రయోగాలను చేసింది మోదీ ప్రభుత్వం. ఆ దిశగా ‘వన్ నేషన్- వన్ పెన్షన్’ పేరిట హోదాలతో సంబంధం లేకుండా పింఛన్ చెల్లించే యత్నాలపై మాజీ సైనికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇప్పుడు మరో రూట్లో మొత్తం పెన్షన్కే ఎసరు పెట్టే చర్యలను కేంద్రం ప్రారంభించింది. ఆ దిశగా తీసుకువచ్చిందే అగ్నిపథ్ కార్యక్రమం. ‘అగ్నిపథ్, అగ్నివీర్.. ఇలాంటి ఫ్యాన్సీ పేర్లతో యువతను ఆకర్షించడం ఒక ఎత్తుగడ. నిశితంగా పరిశీలిస్తే.. దీని వెనుక సర్వీసు, సంక్షేమ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకునేందుకు కేంద్రం వేస్తున్న అడుగులు కనిపిస్తాయి’ అని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మాజీ డిప్యూటీ చీఫ్ తేజేందర్ షెరావత్ పేర్కొనడం గమనార్హం.
ఉద్యోగ భద్రత, భవిష్యత్తుపై భరోసా లేదు..
17.5-23 ఏండ్ల మధ్య వయసున్న నూనుగుమీసాల యువకులే లక్ష్యంగా కేంద్రం అగ్నిపథ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద నాలుగేండ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు. ఆరునెలల శిక్షణ అనంతరం వారికి ప్రతినెలా రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వేతనం చెల్లిస్తారు. అందులోనూ ప్రభుత్వం 30 శాతం కోతపెట్టి, ఆ మొత్తాన్ని తన దగ్గరే ఉంచుకుంటుంది. నాలుగేండ్ల తర్వాత బాధ్యతల విరమణ సమయంలో వారికి రూ. 11లక్షల చెక్కును అందిస్తుంది. చిత్రమేమిటంటే, అందులో సగం డబ్బు అగ్నివీరుడి కాంట్రిబ్యూషనే. వారి నెలవారీ వేతనం నుంచి తగ్గించిన మూడోవంతు మొత్తమే. అంటే, ప్రభుత్వం ఇస్తున్నది సుమారు రూ. 5.5లక్షల మాత్రమే. ఇది సాధారణ ప్రభుత్వశాఖల అటెండర్లు, ఇతర నాలుగోతరగతి ఉద్యోగికి వచ్చే పెన్షన్తో పోల్చితే చాలా తక్కువ. అగ్నివీరుల్లో 25శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సైనికులుగా తీసుకుంటారు. మిగిలిన 75శాతం మంది మళ్లీ రోడ్డునపడాల్సిందే. వారికి ఎలాంటి పెన్షన్ భరోసా ఉండదు.
సవాళ్లను ఎదుర్కొనే సమర్థత సాధ్యమా?
చైనా ప్రతి సంవత్సరం తన సైన్యంపై రూ. 23లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నది. చైనాకు దీటుగా ప్రాంతీయ సైనికశక్తిగా ఎదగాలని కోరుకుంటున్న భారత్ మాత్రం కేవలం నాలుగోవంతు నిధులను మాత్రమే కేటాయిస్తున్నది. చైనా సైనికబలగం 25లక్షలు కాగా, భారత సైన్యం 14లక్షలు మాత్రమే. అయినప్పటికీ సైనిక నిర్వహణను భారత్ భారంగా చూస్తున్నదన్న విమర్శలున్నాయి. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్ నుంచి ఎదురవుతున్న సరిహద్దు సవాళ్లను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సుశిక్షితులైన సైనికులు అవసరం. ఆరునెలల ప్రాథమిక శిక్షణతో ఇది ఏ మేరకు సాధ్యమని రక్షణరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వారికి అధునాతన ఆయుధాలపై శిక్షణ ఉండదు. భవిష్యత్తులో సైన్యాన్ని శాసించబోయే కృతిమమేథ, సైబర్ యుద్ధనీతిలో వారికి ఎలాంటి ప్రవేశమూ ఉండదు. రెజిమెంట్ల వ్యవస్థ నిర్వీర్యమవుతుంది.