హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎం మీడియా సమావేశాన్ని నిర్వహిస్తే వచ్చిన నష్టమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత అని, టీవీ చానళ్లకు సమాచారం ఇవ్వడం తప్పెలా అవుతుందని అడిగింది. ఎమ్మెల్యేల ఎర కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్, ఇతర వ్యాజ్యాలపై హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రేమేందర్రెడ్డి పిటిషన్పై బుధవారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్ న్యాయవాది బీ శ్రీనివాస్ తరఫు సీనియర్ న్యాయవాది ఉదయ హోళ్ల వాదించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించకూడదని చెప్పారు. సీఎం ప్రెస్మీట్..సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ వాదనను సిట్ తరఫున అదనపు ఏజీ వ్యతిరేకించారు. ఎమ్మెల్యేలకు ఎర సమాచారాన్ని సిట్ ఎవరికీ ఇవ్వలేదని స్పష్టంచేశారు. సీఎంకు, మీడియాకు ఇవ్వలేదని సిట్ గతంలోనే ప్రకటించిందని గుర్తుచేశారు.
సీఎంకు ఎవరు సమాచారం ఇచ్చి ఉంటారని హైకోర్టు ప్రశ్నించగా, ఫిర్యాదుదారుల్లో ఒకరైన ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఇచ్చి ఉండవచ్చునని ఏఏజీ అభిప్రాయపడ్డారు. ఈ కేసు మొత్తం సమాచారాన్ని సిట్ పిటిషనర్లకు కూడా అందించిందని, బహుశా పిటిషనర్లలో ఒకరైన రోహిత్రెడ్డి ద్వారా సీఎంకు చేరి ఉంటుందని తెలిపారు. సమాచారం పిటిషనర్లకు తెలుసునని, సీఎం ప్రెస్మీట్ పెడితే తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. సీఎం ఒక పార్టీ అధినేతని, టీవీ చానళ్లకు సమాచారం చెప్తే అది తప్పెలా అవుతుందని అడిగింది. ఏఏజీ తన వాదనలు కొనసాగిస్తూ.. కేసుకు, తమకు సంబంధం లేదంటూనే.. సిట్ విచారణ జరుపవద్దంటూ బీజేపీ హైకోర్టులో కేసులు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అనే అంశానికే కేసు పరిమితం కాలేదని, ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర కూడా ఉన్నదని వివరించారు. నిందితుల వద్ద లభ్యమైన కీలక సమాచారంలో అనేక మంది నేతలు, ఎమ్మెల్యేల వివరాలు ఉన్నాయని తెలిపారు. కాగా, నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిల వాదనల నిమిత్తం తదుపరి విచారణను ఈ నెల 9కి హైకోర్టు వాయిదా వేసింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కారణంగా నిందితుల తరఫు సీనియర్ న్యాయవాది, ఎంపీ మహేశ్ జఠ్మలానీ ఆ రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించనున్నారు.