BJP | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16: బీజేపీకి ఎన్నికల ప్రచారం మొదట్లోనే చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర అధ్యక్షుడితోపాటు కేంద్ర మంత్రి హాజరైన సభలో నేతలు ప్రసంగిస్తుండగానే జనం తిరిగి వెళ్లిపోవడంతో కంగుతిన్నారు. ప్రచారం ఊపందుకోకముందే ప్రజల నుంచి ఇలాంటి ఛీత్కారం ఎదురవడంతో భవిష్యత్తు కండ్ల ముందు కనిపించింది. సోమవారం రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ జన గర్జన సభ నిర్వాహించారు. ముఖ్యఅతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు.
జనం కోసం 7,500 కుర్చీలు వేసిన్నట్టు తెలిసింది. బీజేపీ నాయకులు 20 వేల వరకు జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఆశించినంతగా జన సమీకరణ చేయలేక పోయామని ఆ పార్టీ నాయకులు గుసుగుసలాడుకున్నారు. కుర్చీలు ఉన్నంత వరకు ప్రజలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభం అయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మాట్లాడుతుండగానే ప్రజలు తిరిగి వెళ్లిపోవడం మొదలైయింది. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్న సమయంలో గ్రౌండ్లో దాదాపుగా సగానికి పై కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అందరూ వెళ్లిపోతుంటే ఇంకా ఏమి మాట్లాడుతారని ఆ పార్టీ నాయకులే విసుక్కున్నారు. జన గర్జన సభ జనం వెళ్లిపోవడంతో వెలవెల పోయింది.