నాగర్కర్నూల్, మార్చి 10 : సాగు నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, పెట్టుబడి అప్పులు ఎవరు భరిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. వారం రోజులుగా నాగర్కర్నూల్ జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా ప్రవాహం తగ్గిపోవడంతో మంగళవారం 50 మంది రైతులు నాగర్కర్నూల్, బిజినేపల్లి మండలాల అన్నదాతలు సల్కర్పేట సమీపంలో ఉన్న బై కెనాల్ కాలువ వద్ద నిరసన తెలిపారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యను ఎమ్మెల్యే రాజేశ్రెడ్డితోపాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. రైతులకు నీళ్లు అందకుండా కాలువల్లో అడ్డుకట్ట వేసి కల్వకుర్తికి తరలిస్తున్నారని మండిపడ్డారు. పంటలు ఎండిపోతే అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. ఇరిగేషన్ అధికారులు అక్కడికి వెళ్లగా పంటలకు నీళ్లివ్వాలని వాగ్వాదానికి దిగారు. సరిపడా నీటిని అందిస్తామని రైతులకు హామీ ఇచ్చి వెళ్లిపోయారు.
పంటలెండుతున్నయ్.. నీళ్లియ్యండి సారూ! ; కరీంనగర్ జిల్లా వీణవంక రైతుల వినతి
వీణవంక, మార్చి 10 : సాగు నీరు లేక పొట్టదశకు వచ్చిన వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి ఆదుకోవాలని కరీంనగర్ జిల్లా వీణవంక రైతులు ప్రభుత్వంతోపాటు ఇరిగేషన్ డీఈఈని కోరారు. మంగళవారం వారు మీడియా తో మాట్లాడుతూ.. వీణవంక పెద్ద చెరువు తూముకు మరమ్మతులు చేయకపోవడంతో సాగు నీరు వృథాగా పోతుందని తెలిపారు. ఈ చెరువు కింద 200 ఎకరాలు సాగవుతుందని, సుమారు వెయ్యి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లులేకపోతే ఎండిపోయి ఎడారిలా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా స్పందించి ఎస్సారెస్పీ కాలువ ద్వారా బేతిగల్ చెరువును నింపితే అక్కడి నుంచి వచ్చే నీటితో వీణవంక చెరువు నిండుతుందనిర రైతులు కోరారు.