హైదరాబాద్: ఫార్ములా-ఈ కారు రేసును తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచపటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ‘ఫార్ములా-ఈ ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలి. అందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నా..
రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.46 కోట్లు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది. కేవలం బ్యాంకు లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉంది. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు. ప్రతి నయా పైసాకూ లెక్క ఉంది. మరి అలాంటప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది. ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసుల విచారణ పేరుతో ఈ అంశాన్ని లాగుతున్నది. కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయి. అప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Hosting Formula E in India/Telangana/Hyderabad remains one of my most cherished decisions as a Minister. The pride I felt, witnessing international racers & E-Mobility industry leaders praise our city, is memorable
No amount of frivolous cases, cheap mudslinging, or political…
— KTR (@KTRBRS) January 16, 2025