Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. ముందుగా ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తాం’.. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో, ప్రకటనల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది.
ఫిబ్రవరి 1 వచ్చింది.. వెళ్లింది.. కానీ లక్షల మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ మాత్రం రాలే దు. హామీ ఇచ్చినవాళ్లకు, దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసినవాళ్లకు పదవులొచ్చాయి. ఆ సంతోషంలో నిరుద్యోగులను మరిచిపోయా రు. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఓట్లకోసమే తప్పుడు హామీలతో కాంగ్రెస్ తమను మోసం చేసిందని మండిపడుతున్నారు.
మొదటి హామీనే అట్టర్ఫ్లాప్
తమకు ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఫిబ్రవరి 1నే గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తామని విపరీతంగా ప్రచారం చేసింది. ఆ మాటలు నమ్మిన లక్షలమంది నిరుద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. అధికారంలోకి వచ్చాక అలవాటు ప్రకారం కాంగ్రెస్ తన హామీలను మరిచిపోయింది.
ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులకు జనవరి 30 వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1 పోస్టుల లెక్క లు తీయాలని అధికారులను నింపాదిగా కోరింది. ఆ లెక్కలు హామీ అమలు తేదీకి ఒక్కరోజు ముందు అంటే బుధవారం సాయం త్రం ఓ కొలిక్కి వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం కొత్తగా 97 గ్రూప్-1 పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. గత కేసీఆర్ ప్రభుత్వం 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం కలిపితే 600 అవుతున్నా యి.
ఇప్పుడు కొత్తగా గుర్తించిన పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ముందుగా అనుమతివ్వాలి. భర్తీ ప్రక్రియ చేపట్టాలని టీఎస్పీఎస్సీని కోరాలి. వీటిని గత పోస్టులతో కలుపుతారా? లేదా అన్నది కూడా తేలాలి. ఇదంతా తేలేందుకు కనీసం నెల పట్టే అవకాశం ఉన్నది. దీని గురించి ప్రభుత్వ పెద్దలకు తెలియనిది కాదు. నోటిఫికేషన్ జారీచేసేందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్లో మొదటి హామీనే నెరవేర్చలేకపోతే.. ఇక ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామన్న మాట ఎలా నిలబెట్టుకుంటారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.