Bharat Rice | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘భారత్ రైస్’ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నది. రాష్ట్రంలో ఈ పథకం అమలుకు అవసరమైనన్ని బియ్యం నిల్వలు లేవని సాకులు చెప్తున్నది. బియ్యం అందుబాటులో ఉన్నప్పుడు కేటాయిస్తామని, అప్పటి వరకు రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయబోమని నోడల్ ఏజెన్సీలకు ఎఫ్సీఐ అధికారులు తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది.
దీంతో రాష్ట్రంలోని నిరుపేదల పొట్ట కొట్టిందని కేంద్రంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ర్టాల్లో అందుబాటులో ఉన్న బియ్యం నిల్వలు తెలంగాణలోనే ఎందుకు లేవన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు ఇప్పటికే భారీగా పెరగడంతో జనం అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో బియ్యం ధరలను కట్టడి చేయడంతోపాటు సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 6న ‘భారత్ రైస్’ పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా కిలో రూ.29కే బియాన్ని విక్రయిస్తున్నది.
నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ లాంటి సంస్థల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందుకు అవసరమైన బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ఆయా సంస్థలకు అందించాల్సి ఉంటుంది. తెలంగాణలో ‘భారత్ రైస్’ పథకాన్ని అమలు చేసేందుకు నాఫెడ్, కేంద్రీయ భండార్ లాంటి నోడల్ సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం, ఎఫ్సీఐ నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆ సంస్థలు వేచి చూస్తున్నాయి.
రాష్ట్రంలో ఫోర్టిఫైడ్ రైస్ మాత్రమే అందుబాటులో ఉందని, నాన్-ఫోర్టిఫైడ్ రైస్ (సాధారణ బియ్యం) అందుబాటులో లేవని ఎఫ్సీఐ చెప్తున్నట్టు తెలిసింది. దీంతో ఎఫ్సీఐ సరిగ్గా దృష్టి పెడితే సీఎంఆర్ కోటాలో మిల్లర్ల నుంచి నాన్-ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, ఆ దిశగా కేంద్రం చర్యలు చేపట్టకపోవడంతో భారత్ రైస్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయోద్దని మోదీ సర్కారు భావిస్తున్నదేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సైతం అమలవుతున్న ఈ పథకాన్ని పుష్కలంగా బియ్యం అందుబాటులో ఉండే తెలంగాణలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.