నిర్మల్ : సీఎం కేసీఆర్ కవులు, కళాకారులకు ప్రాధాన్యతనిస్తూ వారికి తగిన గౌరవాన్ని కల్పిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత మన కవులు, కళాకారులకు మంచి ఆదరణ, అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు రూ.10వేల పెన్షన్ను మంజూరు చేసినందుకు గుస్సాడీ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులు కనకరాజుకు శాలువా కప్పి సన్మానించారు.
ప్రభుత్వం తరపున తనకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేలా చూడాలని కనకరాజు… మంత్రిని కోరారు. సీయం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి తన వంతు సహయం చేస్తానని మంత్రి భరోసానిచ్చారు.
కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మర్లవాయి సర్పంచ్ ప్రతిభ వెంకటేశ్వరరావు, ఆదివాసీ నాయకులు ఆత్రం భుజంగరావు, ఆత్రం శంకర్, టీఆర్ఎస్ నాయకులు ఇంతియాజ్ ఖాన్, జూగ్నక దేవ్ తదితరులు ఉన్నారు.