(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ‘ఢిల్లీ మద్యం విధానం’లో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు నిరుడు మే 7న సూటిగా ప్రశ్నించింది. ఈ కేసులో ఈడీ తగిన సాక్ష్యాధారాలతో దర్యాప్తు కొనసాగించడం లేదని అసహనం వ్యక్తంచేసింది. స్టేట్మెంట్ల సాయంతో తప్ప.. ఆధారాలకు అనుగుణంగా ఈ దర్యాప్తు కొనసాగడం లేదని అభిప్రాయపడింది. అప్రూవర్ చెప్పిన వివరాలనే ఈడీ ప్రామాణికంగా తీసుకోవడంపైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. రూ. 100 కోట్ల అక్రమాలు జరిగినట్టు చెప్తున్న ఈడీ.. నగదును మాత్రం లక్షల్లోనే చూపించడంపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ విస్మయం వ్యక్తంచేశారు. మద్యం పాలసీలో అక్రమ లావాదేవీలు జరిగాయనడానికిఈడీ తగిన ఆధారాలు చూపించట్లేదని జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు.