ఇల్లందకుంట, అక్టోబర్ 3: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గొల్ల, కురుమలకు ఏం చేసిందని ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమలను ఆదుకోడానికి పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నదని చెప్పారు. ఆదివారం ఇల్లందకుంటలో కురుమ కులస్తులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం మండలంలోని అన్ని గ్రామాల్లో కురుమ సంఘ నాయకులు ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కురుమ కులస్తులను ఆర్థికంగా ఎదగడానికి చేయూతనిచ్చిందని, గొర్రెలను పంపిణీ చేసిందని, కురుమ పిల్లల చదువు కోసం హైదరాబాద్లో హాస్టల్ నిర్మించిందని గుర్తు చేశారు.