మంచిర్యాల, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : క్యాతనపల్లి మున్సి‘పోల్’ ఘటనతో మంచిర్యాల పోలీసుల అసలు రంగు బయటపడింది. గొడవను తప్పుదారి పట్టించబోయి వాళ్లే అడ్డంగా బుక్కయినట్టు స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారన్న ఆరోపణలకు బలం చేకూర్చే వీడియో ఒకటి బయటికి వచ్చింది. దీంతో ఇప్పటిదాకా ఈ కేసులో పోలీసులు చెప్పినవన్నీ అబద్ధాలేనని నిరూపించే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇందులో బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల లాఠీచార్జ్కి ముందు.. వందలాది కాంగ్రెస్ నాయకులు, 50మంది కూడా లేని బాల్క సుమన్, ఇతర బీఆర్ఎస్ నాయకుల సమూహం వైపు నినాదాలు చేస్తూ, రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తూ దూసుకొస్తుంటే, సార్ రెచ్చగొడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో మొరపెట్టుకుంటున్న దృశ్యాలను పరిశీలిస్తే అసలు రెచ్చగొట్టింది కాంగ్రెస్ నేతలేనని స్పష్టంగా తెలుస్తున్నది.
ఏ క్యాతనపల్లి ఫ్లై ఓవర్ ఎంట్రెన్స్లో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారో, అదే ఫ్లైఓవర్ కిందిభాగంలో వందలాదిగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు పార్కింగ్ చేసిన వాహనాలుండటం వీడియో ద్వారా బయటికి వచ్చింది. అయితే ముందుగానే కాంగ్రెస్ నాయకులను ఫ్లైఓవర్ కిందికి ఎందుకు అనుమతించారు? బీఆర్ఎస్ నాయకులను కనీసం ఫ్లైఓవర్ పైకి రాకుండా ఎందుకు అడ్డుకున్నారు? ఒక్కసారిగా వందలాదిగా కాంగ్రెస్ మూకలు దూసుకొస్తుంటే ఆపకుండా ఎందుకు చోద్యం చూశారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందే ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ నాయకులను ఫ్లైఓవర్ ఎంట్రెన్స్లో ఆపేసి, అదే సమయంలో ైఫ్లైఓవర్ కిందున్న కాంగ్రెస్ నాయకులను గొడవకు దిగేలా ప్రేరేపించింది పోలీసులేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో బాల్క సుమన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కో వ లక్ష్మితో పాటు 500మంది బీఆర్ఎస్ నాయకులు వచ్చారని మొన్న మంచిర్యాల డీసీపీ భా స్కర్ చెప్పినప్పటికీ.. ఆ వీడియోలో మాత్రం కాంగ్రెస్ నాయకులు దూసుకొస్తున్న సమయంలో 50మంది బీఆర్ఎస్ నాయకులు కూడా కనిపించకపోవడం గమనార్హం.
తమను అనుమతించనప్పుడు కాంగ్రెస్ నాయకులను కూడా పంపొద్దని బీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టిన క్రమంలో కాంగ్రెస్ నాయకులు రాళ్లతో బీఆర్ఎస్ నాయకులపైకి దాడి చేశారు. దానిని ప్రతిఘటిస్తూ బీఆర్ఎస్ నాయకులు తిరగబడ్డారు.పోలీసులు మాత్రం ముందు రాళ్లు విసిరిన కాంగ్రెసోళ్లను వదిలేసి, బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జ్ చేశారు. బాల్క సుమన్, మూల రాజిరెడ్డి, అనిల్ సహా 20మంది బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసు పెట్టారు.