హైదారాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ( Education Commission ) ఇచ్చిన నివేదికపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు (Harish Rao) ఎక్స్ వేదికగా స్పందించారు. అసలు విద్యావేత్తలే లేని కమిటీని వేసి, వారితో విద్యా విధానంపై నివేదిక ఇప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యా కమిషన్లో అసలైన విద్యావేత్తలు ఎక్కడ అని ప్రశ్నించారు.
తెలంగాణ విద్యా కమిషన్లో స్కూల్ పిల్లలకు గానీ, కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇద్దరు ప్రొఫెసర్లు మినహా, ఎడ్యుకేషన్ లో పీహెచ్డీ చేసిన వాళ్లు కానీ, స్కూల్ సిలబస్ తయారీలో, కోర్ సైన్స్ సబ్జెక్టుల్లో పట్టున్న వాళ్లు కానీ ఈ కమిటీలో ఒక్కరైనా లేరని పేర్కొన్నారు.
ఈ కమిటీ చైర్మన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని పైగా ఆయనొక ఇంజనీర్ అని అన్నారు. ఆఫీసులు నడపడం వేరు. చదువులు చెప్పడం వేరు. పరిపాలనలో అనుభవం ఉన్నంత మాత్రాన. పిల్లల సైకాలజీ, పాఠాలు చెప్పే పద్ధతుల మీద పూర్తి అవగాహన ఉన్నట్టా. తెలంగాణ విద్యా భవిష్యత్తును మార్చేంత అర్హత, నైపుణ్యం ఈ కమిటీకి ఉందని మీరు నిజంగానే నమ్ముతున్నారా అంటూ ప్రశ్నించారు.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత కీలకమైన విద్యా కమిషన్లో విద్యావేత్తలు, అనుభవం ఉన్న టీచర్లు, పిల్లల మనస్తత్వం తెలిసిన చైల్డ్ సైకాలజిస్టులు, సబ్జెక్ట్ నిపుణులు లేకుండానే రాష్ట్రానికి ఏకంగా ఒక కొత్త విద్యా విధానాన్ని తయారు చేయొచ్చనే గొప్ప ఆలోచన మీకే దక్కుతుందని పేర్కొన్నారు.సిలబస్ ఎలా ఉండాలి, బోధనా పద్ధతులు ఎలా ఉండాలి అనేది గ్రౌండ్ లెవెల్లో పాఠాలు చెబుతున్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కు తెలుస్తుంది కానీ.. అసలు ఆ సంబంధమే లేని అధికారులకు, వేరే రంగాల వారికి ఎలా తెలుస్తుందని నిలదీశారు.
విద్యావ్యవస్థ మీద కనీస అవగాహన లేకుండా, అర్హత లేని వారితో ప్రయోగాలు చేయడం అంటే తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని అన్నారు. విద్యాశాఖను ముఖ్యమంత్రి ఎంత నిర్లక్ష్యంగా గాలికి వదిలేశారో చెప్పడానికి ఈ కమిటీ ఏర్పాటే ఒక ఉదాహరణ అని విమర్శించారు. కొత్త విద్యా విధానం విషయంలో తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు పారదర్శకతను కోరుకుంటున్నారని తెలిపారు.
గడిచిన రెండేండ్లుగా విద్యాశాఖను గాలికి వదిలేసి, సబ్జెక్ట్ తెలిసిన విద్యావేత్తలకు ఈ బాధ్యత అప్పగించకుండా, సంబంధం లేని వారితో కమిటీ వేసి కాలయాపన చేసి ఏం సాధించినట్లని ఆరోపించారు. వేసిన కమిటీ ఎంత గొప్పగా ఉంటే, వారిచ్చిన నివేదిక ఇంకెంత గొప్పగా ఉంటుందో అర్థమవుతున్నదని, విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించే నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.