Vande Bharat Train | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్ల సంఖ్య ఏడాది దాటినా అంతంత మాత్రంగానే ఉన్నది. ఏటా 100 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తామని నిరుడు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు 50 రైళ్లను కూడా ప్రారభించలేదు.
వందేభారత్ రైళ్ల విషయంలో కేంద్రం దక్షిణ మధ్య రైల్వే జోన్కు, ముఖ్యంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నది. ఉత్తర భారతావనిలోని వివిధ ప్రాంతాల మధ్య అనేక వందేభారత్ రైళ్లను నడుపుతున్న నరేంద్రమోదీ సర్కారు.. తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 రైళ్లను ప్రారంభించి చేతులు దులిపేసుకున్నది. దక్షిణ మధ్య రైల్వే జోన్లో అత్యంత కీలకమైన హైదరాబాద్/సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వందేభారత్ రైళ్లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
నత్తనడకన వందేభారత్ కోచ్ల తయారీ
ప్రస్తుతం వందేభారత్ రైళ్ల బోగీలను చెన్నైలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో మాత్రమే తయారు చేస్తున్నారు. కానీ, ఆ ఫ్యాక్టరీ సామర్థ్యం చాలా తక్కువగా ఉండటంతో వారానికి ఒక బోగీ మాత్రమే తయారవుతున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్)ని ఏర్పాటు చేయాల్సి ఉన్నది. అందుకు తొలుత అంగీకరించిన కేంద్రం.. ఆ తర్వాత మాట మార్చింది. కాజీపేటలో ఆర్సీఎఫ్ను ఏర్పాటు చేయడం లేదని ప్రకటించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. దీంతో కాజీపేటలో ఆర్సీఎఫ్ను ఏర్పాటు చేసినట్టయితే వందేభారత్తోపాటు ఇతర రైళ్ల బోగీలను వేగంగా తయారు చేసేందుకు వీలయ్యేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.