న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోని కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాల(కేవీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్రావు ప్రశ్నించారు. ఒక జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ కేంద్రీయ విద్యాలయాలు ఉన్న జిల్లాలను తమకు తెలుపాలని కోరారు. అయితే, ఎంపీ నామ ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ లిఖితపూర్వకంగా సోమవారం స్పందించింది.
దేశంలో కొత్తగా కేంద్రీయ విద్యాలయాల(కేవీ) ఏర్పాటు అనేది నిరంతర ప్రక్రియ అంటూ వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, దాని అనుబంధ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగుల పిల్లల విద్యా అవసరాలు తీర్చేందుకు కేంద్రీయ విద్యాలయాలు ప్రాథమికంగా ఏర్పాటు చేస్తారని వివరించింది. భారతదేశంలో మొత్తంగా 261 జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ కేవీలు కలిగి ఉన్నట్లు వెల్లడించింది.