టేకుమట్ల, మే 27: అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని కొన్ని కుటిల శక్తులు ఆగం చేయాలని చూస్తున్నాయని, బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులుగా మారి సంక్షేమ పథకాలను ఆయుధాలుగా చేసుకుని ప్రతిపక్షాలపై యుద్ధం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చలు పెట్టి ప్రజల హృదయాలను గెలుచుకోవాలని సూచించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ వస్తే కరెంట్ లేక రాష్ట్రంలో చీకటిమయం అవుతుందని, కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అన్నారని, ఇప్పడు అదే కిరణ్కుమార్రెడ్డి వచ్చి తమ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసి బతుకుతాడా అని ఎద్దేవా చేశారు. 70 ఎండ్ల పాలనలో రాష్ట్రంలోని గోదవరి నదిపై ఒక్క ప్రాజెక్టు కడితే, స్వరాష్ట్రంలో 5 కొత్త ప్రాజెక్టులు కట్టి సముద్రంలో కలిసే జలాలను ఎత్తిపోసి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని వివరించారు. మండుటెండల్లోనూ వాగులు, చెరువులు జలకళను సంతరించుకొని పాడిపంటలు, మత్స్య సంపదకు దోహదపడుతున్న విషయాన్ని ప్రతిపక్షాలకు వివరించాలని సూచించారు. తాను 1982లో భూపాలపల్లికి వస్తే అన్నం దొరకలేదు.
కాటారం పోయి అన్నం తిన్న. అలాంటి భూపాలపల్లి నేడు జిల్లాగా రూపాంతరం చెంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. దేశంలో బలమైన ప్రతి పక్షం లేదు కాబట్టే.. బీజేపీ కుల, మత రాజకీయాలు చేసి దేశ అభివృద్ధిని విస్మరిస్తున్నదని విమర్శించారు. అంతకుముందు రాఘవపూర్లో బీఆర్ఎస్ ఉద్యమకారుడు, సీనియర్ నాయకుడు, సర్పంచ్ ఆది రాంనర్సయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం గర్మిళ్లపల్లి, టేకుమట్లలో రూ.40 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఆత్మీయ సమ్మేళనం ఇన్చార్జి అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.