సుబేదారి, నవంబర్ 4: కార్మిక శాఖ సహాయ అధికారి సాయంతో నకిలీ పత్రాలను తయారు చేసి, కార్మిక శాఖ సంక్షేమ మండలి పథకాల సొమ్మును కాజేసిన ఏడుగురు సభ్యుల ముఠాలో ఇద్దరిని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీపీ తరుణ్జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన రాపాక వీరభద్రస్వామి, చెన్నారావుపేటకు చెందిన పర్ష రవి, నర్సంపేట కార్మిక శాఖ సహాయ అధికారి లావుడ్యా నరసింహ, నెక్కొండకు చెందిన మహ్మద్అలీ, చందు, పూల్యా, చిందం అశోక్ కలిసి నకిలీ పత్రాలు సృష్టించారు.
9 మంది నుంచి రూ.18.70 లక్షల కార్మిక సంక్షే మ పథకాల డబ్బులు స్వాహా చేశారు. ఈ కేసులో కార్మికులకు మధ్య ఏజెంట్గా వీరభద్రస్వామి ఉండి వ్యవహారం నడిపించాడు. చనిపోయిన వారు, ప్రమాదాల్లో గాయపడిన వారి సమాచారాన్ని కార్మిక శాఖ అధికారి నరసింహ సాయంతో సేకరించి, నకిలీ పత్రాలు సృష్టించి సంక్షేమ పథకాల డబ్బు కాజేశారు. పక్కా సమాచారంతో నిందితులు వీరభద్రస్వామి, రవిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ పత్రాలు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.