మహబూబ్ నగర్, నవంబర్ 24 : నిత్యం తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే పరితపించే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మరొకసారి అవకాశం ఇవ్వండి. ఆశీర్వదించి మరోసారి అసెంబ్లీకి పంపండి. అభివృద్ధిని కొనసా గించడంతోపాటు మీకు ఇప్పటిలాగే ఎప్పటికీ ఆపదలో అండగా ఉంటాడని హోం మంత్రి మహమూద్ అలీ (Minister Mohamood Ali) అన్నారు. మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ వల్లే సాధ్యమని ఆయన అన్నారు.
శుక్రవారం మహబూబ్నగర్ పట్టణంలోని షాసాబ్ గుట్ట, మోటర్ లైన్ మసీదుల వద్ద నమాజ్ అనంతరం మంత్రులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షాసాబ్ గుట్ట దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైనారిటీ సోదరులకు చేసిన అభివృద్ధిని వివరించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
మహబూబ్ నగర్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి, మతసామరస్యాలకు నిలయంగా మార్చామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి హజ్ హౌస్ మహబూబ్ నగర్ లో నిర్మించామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ ఇబ్రహీం, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ షబ్బీర్, మైనార్టీ నాయకులు జావేద్ బేగ్ తదితరులు ఉన్నారు.