నల్లగొండ రూరల్, నవంబర్ 15: బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీసీ కులాల ఫెడరేషన్లకు సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ తెలిపారు. నల్లగొండలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 11 బీసీ కులాల ఫెడరేషన్ల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.
విశ్వబ్రాహ్మణ, కార్పెంటర్, గీత కార్మిక, రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, సగర ఉప్పర, వాల్మీకి, పూసల, భట్రాజు, కుమ్మర శాలివాహన, మేదర కులాల ఫెడరేషన్ల నుంచి కమ్యూనిటీకి నలుగురు చొప్పున 10 శాఖల అధికారులతో కమిటీ ఉంటుందని తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,452 మందిని సంక్షేమ కమిటీ సభ్యులుగా నియమించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉన్నదన్నారు. సమావేశంలో కుల సంఘాల నాయకులు గుండాల మల్లేశ్గౌడ్, చిలుకరాజు చెన్నయ్య, నేలపట్ల రమేశ్, గంగాధర్, వెంకటేశ్వర్లు, నోముల రవి పాల్గొన్నారు.