రాజన్న సిరిసిల్ల, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్కు చెందిన తడుక శ్రీనివాస్ (42)కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పదిహేను సంవత్సరాల నుంచి శ్రీనివాస్ మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేతినిండా పని దొరికేది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లను ఇవ్వకపోవడం, పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో మరమగ్గాలను యజమానులు బంద్పెట్టారు. దీంతో శ్రీనివాస్ ఉపాధి కోల్పోయాడు. అనారోగ్య కారణాలు కూడా తోడయ్యాయి. చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడం.. కొంతకాలంగా భార్యాపిల్లలు దూరం ఉండటంతో ఆవేదన చెందాడు. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రఘుపతి తెలిపారు.
పరిహారం ఇవ్వాలని నేతన్నల ధర్నా..
శ్రీనివాస్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు, చేనేత కార్మికులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభం తలెత్తిందని ఆరోపించారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నేతన్నలు ధర్నా చేశారు. వెంటనే ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.