Weather Report | తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎండలు దంచికొడుతున్నాయి. మళ్లీ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఐదురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది.
ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆదివారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. గడిచిన 24గంటల్లో వనపర్తి, మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఇక నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలో మిగతా ప్రాంతాలకు విస్తరించాయని అమరావతి వాతావరణ విభాగం పేర్కొంది.
రాబోయే 24గంటల్లో నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల మీదుగా ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈస్ట్ సెంట్రల్ బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గత ఆరుగంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపుగా కదులుతోందని.. పేర్కొంది. ఉత్తర వైపు కదులుతూ సాయంత్రం నాటికి తూరు మధ్య కదులుతూ ఆదివారం ఉదయం నాటికి తీవ్ర తుఫానుగా మారి అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్, ఆనుకొని పశ్చిమ బెంగాల్ తీరాలను దాటుతుందని పేర్కొంది.