హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాం తాల్లో పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన భారీ కుట్రను హర్యానా పోలీసులు ఛేదించారు. పాకిస్థాన్ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఆదిలాబాద్, నాందేడ్కు తరలించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. గురువారం ఉదయం హర్యానాలోని కర్నాల్ జిల్లా బస్తారా టోల్ప్లాజా వద్ద అనుమానిత ఇన్నోవాను గుర్తించిన స్థానిక పోలీసులు నలుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొన్నారు.
వీరి వద్ద నుంచి 7.5 కిలోల బరువు ఉన్న మూడు ఐఈడీ(ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)లు, టైమర్లు, డిటోనేటర్లు, ఒక పిస్టల్, 31 లైవ్ కాట్రిడ్జ్లు, ఆరు మొబైల్ఫోన్లు, రూ.1.3 లక్షల నగదును స్వాధీనం చేసుకొన్నట్టు కర్నాల్ ఎస్పీ గంగారామ్ పునియా మీడియాకు వెల్లడించారు. హర్యానా డీజీపీ పీకే అగర్వాల్, ఎస్పీ గంగారామ్ తెలిపిన వివరాల ప్రకారం..ఉగ్రకుట్రకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు కేంద్ర నిఘావర్గాలు, హర్యానా, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులకు పట్టుబడ్డవారిలో పంజాబ్లోని ఫిరోజ్పూర్కు చెందిన గుర్ప్రీత్సింగ్ (కీలక నిందితుడు), పర్మిందర్సింగ్, అమన్దీప్సింగ్, లుథియానాకు చెందిన భూపిందర్సింగ్ ఉన్నా రు. వీరంతా పాకిస్థాన్కు చెందిన హ్యాండ్లర్ హర్జిందర్సింగ్ రిండా ఆదేశాల మేరకు పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఆయుధాల తరలింపు వ్యవహారంపై తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదులు ఆదిలాబాద్ను ఎందుకు ఎంచుకున్నారన్న అంశంపై ఆరా తీస్తున్నారు. నిందితులు ఆదిలాబాద్ పేరు ఎందుకు ప్రస్తావించారన్న దానిపై ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నట్టు నిఘా వర్గాలకు చెందిన ఒక సీనియర్ అధికారి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అలర్ట్ అయినట్టు తెలిపారు. హర్యానా పోలీసులు, కేంద్ర నిఘా వర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని, పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాన్ని హర్యానాకు పంపుతున్నట్టు పేర్కొన్నారు.
పేలుడు పదార్థాలు, ఆయుధాలను పాకిస్థాన్ నుంచి డ్రోన్ల ద్వారా తరలించిన హర్జిందర్సింగ్ రిండా వాటిని పంజాబ్లోని ఫిరోజ్పుర్ పొలాల్లో ముందస్తుగా సూచించిన లొకేషన్లలో జారవిడిచినట్టు ఎస్పీ పునియా తెలిపారు. ఈ కుట్రకు ముం దు కీలక నిందితుడు గుర్ప్రీత్సింగ్ స్థానిక జైల్లో రిండా అనుచరుడైన రజ్బిర్సింగ్తో కలిసి చర్చించాడు. ఆ పథకం మేరకు పేలుడు పదార్థాలను తరలించినట్టు పేర్కొన్నారు. పేలుడు పదార్థాలు పంజాబ్లోని నలుగురికి చేరిన తర్వాత వాటిని ప్రత్యేక యాప్ ద్వారా తెలంగాణలోని ఆదిలాబా ద్, మహారాష్ట్రలోని నాందేడ్లో తాను సూచించిన లొకేషన్లకు చేరవేయాల్సిందిగా రిండా సూచించాడని తెలిపారు. పట్టుబడిన పేలుడు పదార్థాలు, ఆయుధాలను ఎఫ్ఎస్ఎల్కు పంపినట్టు హర్యా నా డీజీపీ వెల్లడించారు. ఈ ఆయుధాలను వాస్తవానికి ఎక్కడికి తరలిస్తున్నారన్నది సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఏసీపీ ర్యాంకు అధికారి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్ఐటీ)ను ఏర్పాటుచేసినట్టు తెలిపారు.