వరంగల్ : పంట నష్టం వాటిల్లిన రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టపరిహారం అందించి అన్నదాతలను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
జిల్లాలోని నర్సంపేట మండలం ఇప్పల తండాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, మిర్చి పంటలను పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతును రాజు చేసి వ్యవసాయాన్ని పండగ చేయడం సీఎం కేసీఆర్ ఆశయం అన్నారు. మన ముఖ్యమంత్రి కూడా ఒక రైతు కావడం ఈ రాష్ట్ర రైతాంగం చేసుకున్న అదృష్టమని మంత్రి పేర్కొన్నారు.
రైతు సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తి రైతు బాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు. రైతులకు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇచ్చిన నాయకులు దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరే అని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్, కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు ఉన్నారు.