కరీంనగర్ : వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు(Planning Board) బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
రైతులు ఏమాత్రం అధైర్య పడవద్దని సూచించారు. మంగళవారం కరీంనగర్(Karimnagar District) జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావుపల్లి, రాంచంద్రాపూర్, దత్తోజిపల్లి ,చొప్పదండి మండలం మంగళపల్లి, లక్ష్మిపురం గ్రామాలల్లో వర్షంతో నష్టపోయిన వరి, మొక్కజొన్న, మామిడి, వాటర్ మిలన్ ,ఇతర పంటలను జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్,చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో వడగండ్ల వానతో 21వేల ఎకరాలలో వివిధ రకాల పంటలు(Crop) దెబ్బతిన్నాయని అన్నారు. దీంతో నష్టపోయిన 18వేల మంది రైతులను తక్షణం ఆదుకునే దిశగా చర్యలను వేగవంతం చేస్తామని వెల్లడించారు. పంటనష్ట నివేదికను సిద్ధం చేసి నివేదికను సమర్పించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.
నివేదిక అందిన వెంటనే నివేదికను ముఖ్యమంత్రికి అందజేసి రైతులకు నష్ట పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మించుకోవడంతో రాష్ట్రంలో నీటినిలువలు పెరిగి వ్యవసాయానికి సమృద్దిగా నీరు అందుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.