హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం గత ఏడేళ్లలో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని కాపాడటానికి నిధులు, అధికారాలు పెంచింది. గౌరవ వేతనాన్ని కూడా గణనీయంగా పెంచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
హైదరాబాదులోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక సంఘం సభ్యుల బాధ్యులు మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించి పరిష్కరించాలని వినపతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం నెలసరి గౌరవ వేతనం జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవ వేతనం 7,500 రూపాయలు ఉండగా, ప్రస్తుతం ఒక లక్ష రూపాయలకు పెంచామని మంత్రి తెలిపారు.
అదేవిధంగా జడ్పీటీసీల గౌరవ వేతనం 2,250 రూపాయల నుంచి 13వేలకు, ఎంపీటీసీల గౌరవ వేతనం 750 రూపాయలు నుంచి 6 వేల500 రూపాయలకు, గ్రామ సర్పంచ్ ల గౌరవ వేతనం వెయ్యి రూపాయల నుంచి 6,500 రూపాయలకు పెంచినట్లు తెలిపారు.
బీజేపీ పాలిస్తున్న మధ్యప్రదేశ్లో 1750 రూపాయలు, కర్ణాటకలో 3వేల రూపాయలు, ఉత్తరప్రదేశ్లో 3,500 రూపాయలు మాత్రమే నెలసరి గౌరవ వేతనం చెల్లిస్తున్నారని ఆయన తెలిపారు. ఇలా అంతటా తక్కువగా ఇస్తున్నారన్నారు. జిల్లా, మండల పరిషత్తులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా ప్రజాపరిషత్ లకు 5 శాతం, మండల పరిషత్ లకు 10 శాతం నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా 2019-20 నుండి కేంద్ర ఫైనాన్స్ కమిషన్ కి సమానంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడ విడుదల చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని జెడ్పిటిసి, ఎంపీటీసీ లకు నిధులు అధికారాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీల సమస్యలు, అధికారాలు, నిధుల కేటాయింపు మున్నగు ప్రధానమైన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడల కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అందె యాకయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, వైస్ ప్రెసిడెంట్ పల్లె వెంకన్న ఉన్నారు.