హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : దక్షిణ డిస్కమ్ స్టోర్లలో సామగ్రి కొరత ఉన్నమాట నిజమేనని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో త్వరలోనే ఈ సమస్యను అధిగమిస్తామని తెలిపారు. టీఎస్ఐపాస్కు సంబంధించిన కనెక్షన్లపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం వాస్తవికమైనదేనని ఆయన అంగీకరించారు. అయితే ఇందులో సంబంధిత మంత్రికి ఎలాంటి సంబం ధం లేదని, ఇది పూర్తిగా డిస్కమ్కు సంబంధించిన వ్యవహారమేనని చెప్పారు. జితేశ్ బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం టీఎస్ఐపాస్లో దరఖాస్తు చేసుకున్నవారికి విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వడంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించామని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు.
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని 33కేవీ, 11కేవీ లైన్ల నిర్వహణను వచ్చే నెలాఖరులోగా క్రమబద్దీకరిస్తామని చెప్పారు. కొత్తగా 75 సబ్స్టేషన్లు సిద్ధమయ్యాయని, వీటి ద్వారా విద్యుత్తు సరఫరా సజావుగా సాగుతుందని తెలిపారు. సీఎండీగా తాను బాధ్యతలు చేపట్టాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, నోటరీల సమస్యను పరిష్కరించానని చెప్పారు. దీన్ని కొందరు దళారులు తమకు అనుకూలంగా మార్చుకుని వినియోగదారులను మోసగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దక్షిణ డిస్కమ్ పరిధిలోని విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, వినియోగదారులు తనను కలిసేందుకు ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని తెలిపారు.