నర్సంపేట, మే 6: కాకతీయ రాజులు నిర్మించిన వారసత్వ సంపదను కాపాడుతామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో నేలమట్టమైన పురాతన శివాలయం, విధ్వంసమైన కాకతీయుల నాటి మట్టికోటను బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ నెల 6న ‘కాకతీయుల కట్టడంపైకి బుల్డోజర్.. తెలంగాణ ఘన చరిత్రకు సర్కార్ సమాధి, మట్టికోటలోని శివాలయం నేలమట్టం, కుప్పకూలిన అశోక్నగర్ శాసనం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అశోక్నగర్లో ధ్వంసమైన కాకతీయుల కాలం నాటి చారిత్రక ఆలయాన్ని పరిశీలించి, సూపర్వైజర్లతో మాట్లాడారు.
కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వారసత్వ సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. పురావస్తు శాఖ సూచించినట్టుగా ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడ శివాలయం ఉన్న విషయాన్ని అధికారులు గమనించలేదని, తక్షణమే పునర్నిర్మాణం చేపడ్తామని హామీ ఇచ్చారు. శివాలయాన్ని నేలమట్టం చేసిన కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆధారాలతో ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.