సిరిసిల్ల : జిల్లాలో జరుగుతున్న సెస్ (సహకార విద్యుత్ సరఫరా సంస్థ ) ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యేలు రవి శంకర్, రసమయి బాల కిషన్ ధీమాను వ్యక్తం చేశారు. గురువారం సిరిసిల్లా లో మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో 15 డైరెక్టర్ స్థానాలను గెలుచుకుంటామని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలకు కొమ్ముకాస్తుందని విమర్శించారు.
దేశంలో ఉత్పత్తి చేస్తున్న కరెంట్ను అంబానీ, అదానీలకు విక్రయించేవాళ్లు కావాలా, రైతులను కంటికి రెప్పలా కాపాడుకునే కేసీఆర్ కావాలా జిల్లా రైతాంగం ఆలోచించుకోవాలని కోరారు. ‘ గత పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల గోస, చేనేత కార్మికుల బాధలు తొలగి పోయాయని’ వారు తెలిపారు. మిడ్ మానేరు వల్ల జిల్లా లోని అన్ని చెరువులు నిండి రైతులు పంటలు సమృద్ధిగా పండిస్తున్నారని తెలిపారు.
రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారు వెల్లడించారు. కరెంట్ సమస్యకు వ్యతి రేకంగా పుట్టింది గులాబీ జెండా అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నేనని వివరించారు. మోటార్ ల వద్ద మీటర్లు పెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులను ఆదుకునేందుకు రైతు బీమా ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్అని అన్నారు. సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తున్నారో తెలియదని తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ వారిని నమ్మవద్దని ఎమ్మెల్యేలు సూచించారు.