హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశాభివృద్ధిని విస్మరించి, ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)) బి ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఉమ్మడి పౌర స్మృతి పేరుతో మరోసారి దేశ ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత ప్రజల ఐక్యతను చీల్చేందుకు కేంద్రం తీసుకొనే నిర్ణయాలను తిరస్కరిస్తామని, అందుకే యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. యూసీసీతో దేశంలో ప్రత్యేక సంస్కృతి కలిగిన గిరిజనులు, మతాలు, జాతులు, ప్రాంతాలతో పాటుగా హిందూమతాన్ని ఆచరించే ప్రజలు కూడా అయోమయానికి లోనవుతారని తెలిపారు.
యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ సోమవారం ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యవర్గం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘కేంద్రం అమలు చేయాలనుకుంటున్న యూసీసీ నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని స్పష్టం అవుతున్నది. దేశంలో పరిషరించాల్సిన సమస్యలెన్నో ఉన్నా పట్టించుకోకుండా తొమ్మిదేండ్లుగా దేశాభివృద్ధిని, సంక్షేమాన్ని బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. దేశంలో పనులేమీ లేనట్టు ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనేందుకే యూసీసీ అంటూ మరోసారి విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది. అందుకే యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తున్నాం’ అని పునరుద్ఘాటించారు.
కలిసివచ్చే పార్టీలను ఏకం చేస్తాం
యూసీసీ బిల్లుకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తామని వివరించారు. భావసారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుపోతూ యూసీసీ బిల్లుపై పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్లమెంట్ ఉభయ సభల్లో చేపట్టే కార్యాచరణకు రంగం సిద్ధం చేయాలని పార్లమెంటరీ పార్టీ నేతలు కే కేశవరావు, నామానాగేశ్వర్రావుకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మతాలు, ప్రాంతాలకు అతీతంగా, దేశ ప్రజల సంసృతి, సంప్రదాయాలను కాపాడాలన్న తమ విజ్ఞప్తిపై తక్షణమే స్పందించి యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామన్నందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సయీపుల్లా రెహ్మానీ, కార్యవర్గ సభ్యులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తావన : రాజ్యాంగంలోని (ఆర్టికల్ 44) ఆదేశిక సూత్రాల్లో మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తావన ఉన్నది.
చర్చ : 1956లో రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటి నుంచి దీని అమలుపై చర్చ-అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి.
పరిధి : వివాహం, విడాకులు, దత్తత, భరణం, సంరక్షణ, వారసత్వ అంశాల్లో దేశ పౌరులందరి మధ్యన ఏకరూపత (యూసీసీ) ప్రధాన ఉద్దేశం
సమస్య: యూసీసీ అమల్లోకి వస్తే వ్యక్తిగత మత చట్టాలు రద్దు అవుతాయి. గిరిజనుల అలిఖిత ఆచార సంప్రదాయాలకు చట్టబద్ధత పోతుంది. వివిధ జాతులు,మతాలు ఉన్న భారతదేశంలో సాధ్యం కాదన్నది ప్రధాన అభ్యంతరం.
సూచన : నెహ్రూ, అంబేద్కర్ యూసీసీ రావాలని అన్నప్పటికీ భారత భూభాగంలోని ప్రజలు అంగీకరించి, విస్తృత సామాజిక ఆమోదం లభించినప్పుడు మాత్రమే దీనిని తీసుకురా వాలని స్పష్టంచేశారు. అందుకే దీనిని రాజ్యా ంగంలోని ప్రాథమిక హక్కుల్లో కాకుండా ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. అంటే ఇది సలహా మాత్రమే!
న్యాయసలహా : 1995, 2000 సంవత్సరంలో సుప్రీం కోర్టు ఆర్టికల్ 44 స్ఫూర్తిని గుర్తుచేసినప్పటికీ దానిని అమలు చేయాల్సిందిగా తాము ఆదేశించడంలేదని విస్పష్టంగా పేర్కొన్నది.
సుప్రీంకోర్టు కూడా సర్వజనామోదంతోనే యూసీసీ రావాలని స్పష్టంచేసింది. లా కమిషన్ 2016లోనే సంప్రదింపులు మొదలుపెట్టినప్పటికీ యూసీసీపై ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు.
మధ్యేమార్గం : యూసీసీలో ఏకాభిప్రాయం కుదిరే అనేక అంశాల్లో ఇప్పటికీ ప్రత్యేక చట్టాలు అమల్లోకి వచ్చాయి. అందువల్ల మళ్లీ యూసీసీ అవసరం ఏమున్నదన్నది ఒక వాదన!