తుర్కయాంజాల్, జనవరి 24: తెలంగాణలో బీజేపీ బలపడకుండా నిలువరించాలని సీపీఎం నిర్ణయించింది. వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక శక్తుల ఐక్యతతోనే దానిని అడ్డుకోవాలని పేర్కొన్నది. ఈ మేరకు సోమవారం పలు రాజకీయ తీర్మానాలను సీపీఎం రాష్ట్ర మహాసభలు ఆమోదించాయి. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య, జీ నాగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. కులగణనను నిరాకరిస్తున్నదని మండిపడ్డారు. రైతుల తిరుగుబాటుతో తాత్కాలికంగా వెనక్కి తగ్గినా, ఏ క్షణంలోనైనా రైతు వ్యతిరేక చట్టాలు తిరిగి తీసుకొచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి దేశంలో పెద్దఎత్తున ధరలు పెరిగేందుకు మోదీ సర్కారు అవకాశం కల్పించిందని విమర్శించారు. దీనిపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు నిరంకుశత్వానికి పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు విధానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మతాన్ని రాజకీయం కోసం వాడుకోవాలని చూస్తున్నదన్నారు. బీజేపీ ఎత్తులను చిత్తుచేసేందుకు తెలంగాణ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని కోరారు. బయ్యారం ఉక్కు ఫాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం, శాసనసభ స్థానాల పెంపు, గిరిజన వర్సిటీ, మైనింగ్ వర్సిటీ ఏర్పాటు లాంటి హామీలను నెరవేర్చకుండా తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ పట్ల వివక్ష, నిర్లక్ష్యం వీడాలని, రాష్ర్టాభివృద్ధికి సహకారించాలని కేంద్రాన్ని డిమాండ్చేశారు.