రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న నాయకుడని, అందుకే రాష్ట్ర ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం రాజన్న పేట గ్రామంలో
రూ.35 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజన్నపేటలో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం కింద బడిలో రూ.33 లక్షల ఖర్చుతో అదనపు తరగతి గదులు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
రాజన్నపేటలో వెనుకబాటుతనం ఉండటంతో దత్తత తీసుకుని అభివృద్ధి చేశానని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇండ్లు లేని అన్ని నిరుపేద కుటుంబాలకు గృహలక్ష్మి కింద ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో రోడ్ల వెంబడి డైనేజీలను నిర్మిస్తామని, కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు వారం రోజుల్లో 90 కుట్టు మిషన్లు అందజేస్తామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త అని, స్వరాష్ట్రంలో కరెంట్ పోతే వార్త అని మంత్రి పేర్కొన్నారు. రైతు భీమా తెలంగాణ మినహా ప్రపంచలో ఎక్కడా లేదన్నారు. రైతు చనిపోతే భీమా ఇచ్చే ప్రభుత్వం కేవలం కేసీఆర్ ప్రభుత్వమేనని చెప్పారు.
రాష్ట్రంలో ఒక లక్ష రైతు కుటుంబాలకు 5 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని మంత్రి తెలిపారు. బీడీ కార్మికులకు పెన్షన్ లు ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని చెప్పారు. మొత్తం 3,400 తండాలను గ్రామ పంచాయితీలు చేశామని, ఇవన్నీ అంత అల్కటి పనులైతే 68 ఏండ్లలో అప్పటి ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క రాజన్నపేట గ్రామంలోనే రూ.20.38 కోట్లను అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేశామన్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలు అందని వాళ్లు ఉంటే వారికీ అందజేస్తామని చెప్పారు. అభివృద్ది, సంక్షేమంలో తెలంగాణ దూసుకుపోతున్నదని, దేశంలోని ఆదర్శ గ్రామాల్లో సింహభాగం తెలంగాణలోనే ఉన్నాయన్నారు.