హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వ సారథ్యంలోనూ యువతకు ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వరింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య బుధవారం హైదరాబాద్లో కవితను కలిసి చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈసారి తమ యూనియన్లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామని, 66 శాతం వరకు నాయకత్వ బాధ్యతల్లో అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 1998లో ఆగిపోయిన కారుణ్య నియామకాలను 2018లో కేసీఆర్ తిరిగి పునరుద్ధరించి వేలాది మందిని నియమించారని పేరొన్నారు. కారుణ్య నియామకాల ద్వారా మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. 1999-2000లో లాభాల్లో కార్మికులకు కేవలం 10 శాతం వాటా ఉండేదని, తెలంగాణ ఏర్పడినప్పుడు 18 శాతంగా ఉండేదని, దాన్ని కేసీఆర్ 32 శాతానికి పెంచారని వివరించారు.
పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 కి పెంచామని, గతంలో సమ్మె చేస్తే సంస్థ జీతం ఇచ్చేది కాదని, తెలంగాణ ఉద్యమ సమయంలో 35 రోజుల పాటు సాగిన సకలజనుల సమ్మెలో పాల్గొన్న వారికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పూర్తి జీతం ఇచ్చారని ప్రస్తావించారు. సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికుల పక్షాన నిలబడే సంఘం టీబీజీకేఎస్ అని చెప్పారు.