కొడంగల్, ఫిబ్రవరి 8: వికారాబాద్ జిల్లా కొడంగల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం సాగు భూములు ఇవ్వలేమని రైతులు తేల్చి చెప్పారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను వదులుకొని ఇప్పుడు తాము ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. పరిహారం చెల్లించినా భూములిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 19 సర్వే నంబర్లోని రైతుల అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. అప్పాయిపల్లిలోని సర్వే నం.19లోని భూము లు మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిపారు.
భూములు ఇచ్చిన వారికి నష్టపరిహారంతోపాటు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అసైన్డ్ భూమిలో మొత్తంగా 74 ఎకరాల్లో 47 మంది రైతులు ఉన్నారని, వారి అభిప్రాయం సేకరించేందుకు వచ్చినట్టు తెలిపారు. తాము దాదాపు 70 ఏండ్లుగా ఈ భూములనే నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని రైతులు తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ భూమి అని తీసుకొంటే తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని కోల్పోతే మళ్లీ భూములను కొనుగోలు చేసుకునే శక్తి తమకు లేదని వాపోయారు. భూములను వదులుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అభిప్రాయసేకరణలో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ విజయ్కుమార్ పాల్గొన్నారు.