భద్రాద్రి కొత్తగూడెం : కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ ధాన్యం కొనిపిస్తామని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని, రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు ధోరణికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పిలుపు మేరకు రైతులు, నిరసన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా జిల్లాలోని బూర్గంపహాడ్ మండల కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షలో విప్ రేగా కాంతారావుతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
రెండేళ్లుగా కేంద్రంలోని మోడీ బీజేపీ తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనేందుకు ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. తెలంగాణ ధాన్యాన్ని కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ని మంత్రుల బృందం కలిస్తే వడ్లు కొనమని తెగేసి చెప్పారన్నారు. కేంద్రమంత్రి కండ కావరంతో తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవమానిస్తే ఇక్కడి బీజేపీ నాయకుల సప్పుడు చేయట్లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎక్కడా..అని ప్రశ్నించారు.
కేంద్రం వడ్లు కొనేంత వరకు ఉద్యమిస్తామన్నారు.