హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): సమాఖ్య స్ఫూర్తిని పాతరేస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడుతామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు తెలిపారు. ప్రజావ్యతిరేక మోదీ సర్కార్ దిగిపోవాల్సిందేనని చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలే టీఆర్ఎస్ ఎజెండా అని స్పష్టంచేశారు. ఆదివారం పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంతో పాటు ఎన్సీపీ అధినేత శరద్పవార్ ఇంట్లో 17 విపక్ష పార్టీలతో నిర్వహించిన సమావేశంలోనూ కేకే, నామా పాల్గొన్నారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను అడ్డుపెట్టుకొని బీజేపీయేతర రాష్ర్టాల్లో అరాచకాలు సృష్టిసున్నదని, దేశ సమాఖ్య స్ఫూర్తికే విఘాతం కలిగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను విక్షప పార్టీల నేతలపై, రాష్ర్టాలపై కేంద్రం ఉసిగొలుపుతున్నదని, దీనిపై పార్లమెంటులో చర్చించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత, రూపాయి విలువ పతనం, ద్రవ్యోల్బణం, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదుల, అగ్నిపథ్ స్కీమ్ వంటి అంశాలపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించినట్టు చెప్పారు. తెలంగాణ వంటి పురోగామి రాష్ర్టాలపై కేంద్రం కక్షగట్టి, వివక్షను చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్దేశిత ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సవ్యంగా, ఆదర్శవంతంగా కొనసాగుతున్నప్పటికీ, కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధించి రాష్ర్టాన్ని ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని రాష్ర్టాలకు 3.5 శాతానికి కుదించిన కేంద్రం.. తనకు మాత్రం 6.2% వరకు విస్తరించుకొన్నదని వివరించారు. దీనివల్ల తెలంగాణతో పాటు అనేక రాష్ర్టాలు ఆర్థికంగా బలహీనం అవుతున్నాయని చెప్పారు. ఈ దుర్మార్గ విధానంపై కలిసికట్టుగా పోరాడుతామని చెప్పారు. విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని నిప్పులు చెరిగారు. మునుపెన్నడూలేని విధంగా మోదీ ప్రభుత్వం నేషనల్ సింబల్ను సైతం తన స్వార్థ రాజకీయాలకు వాడుకొన్న వ్యవహారంపై పార్లమెంటులో చర్చించాలని తాము డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. పార్లమెంటులో వాడే భాష మీద తన పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటరీ పదాలను, ప్రజాస్వామ్య నిరసన రూపాలను సైతం మోదీ నియంత్రృత్వ ధోరణితో తొక్కిపెడుతున్న తీరుపై పార్లమెంటులో నిలదీస్తామని చెప్పారు.
ఆదివాసీ గిరిజనులను శాశ్వతంగా అడవికి దూరం చేసే కుట్రతో కేంద్రం అటవీ హక్కుల చట్ట సవరణ బిల్లు తెస్తున్నదని, దీనిని వ్యతిరేకిస్తామని నామా నాగేశ్వర్రావు తెలిపారు. ఈ సమావేశాల్లో మొత్తం 32 బిల్లులను కేంద్రం తెస్తున్నదని, గతంలో మాదిరిగా ఏకపక్షంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సింగరేణి బొగ్గు టన్ను రూ.3 నుంచి రూ.4 వేలకే లభిస్తుండగా.. రూ.30 వేల నుంచి 40 వేలు పెట్టి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం ఆంక్షలు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో వరి పండించే రైతులను కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని బీజేపీయేతర రాష్ర్టాల్లో మోదీ సర్కార్ చేస్తున్న దుర్మార్గాలను ఎండగడతామని స్పష్టంచేశారు.
విపక్షాల ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తున్న మార్గరేట్ అల్వాకు మద్దతు అంశంపై తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకొంటారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు చెప్పారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై విపక్షాలతో కలిసి పోరాటం చేస్తామని, విపక్ష పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఒకటని వివరించారు. కాంగ్రెస్తో తమకు దోస్తానా ఉండదని స్పష్టంచేశారు.