ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 20 : పట్టణాల తరహాలో ప్రతి పల్లెను అభివృద్ధి పరిచి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రూరల్ మండలం చౌదరిగూడ పంచాయతీ విజయపురి కాలనీలో మల్టీఫర్పస్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంగళవారం రూ.10 లక్షల నిధులు మంజూరు చేశారు.
మంజూరు పత్రాన్ని సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్కు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీల అభివృద్ధిలో సర్పంచ్లు నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల వైపు దృష్టి సారిస్తున్నారని ఆయన తెలిపారు.
ఓయూ కాలనీ ముస్లింలకు ఖబ్రస్థాన్..
చౌదరిగూడ పంచాయతీ పరిధి ఓయూ కాలనీలోని ముస్లిం సోదరులకు ఖబ్రస్థాన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. సర్వే నెంబర్ 808 లోని 1.25 ఎకరాల భూమిని ఖబ్రస్థాన్ కోసం కేటాయించాలన్నారు.
కార్యక్రమంలో విజయపురి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, ఓయూ కాలనీ అధ్యక్షుడు రషీద్, నాయకులు రామకృష్ణ, షరీఫ్, విఘ్నేష్ గౌడ్, రాము గౌడ్ పాల్గొన్నారు.