యాదాద్రి భువనగిరి: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తోనే పొత్తు కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. ఇరు పార్టీల అంగీకారంతోనే తమ పొత్తు ఉంటుందని అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. దేశం మరో శ్రీలంక కాబోతుందని, రాబోయే రోజుల్లో ప్రజలనుంచి నరేంద్ర మోదీకి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
అసమానతలపై దేశం 120 వ స్థానంలో ఉందన్నారు. నిరుద్యోగంలో వందవ స్థానం, ఆకలి సమస్యలలో 107వ స్థానం ఉందని పేర్కొన్నారు. మనకంటే చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రజలను మోసం చేసే పద్ధతిని నరేంద్ర మోదీ అవలంబిస్తున్నారని అన్నారు. దేశ సంపదలో 75శాతం అంబానీ చేతుల్లోనే పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
సామాన్య ప్రజలు వినియోగించే వస్తువులపై విఫరీతంగా ధరలు పెంచి నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో నాలుగువందల పబ్లిక్ సెక్టార్లను ప్రైవేటుపరం చేసేందుకు పార్లమెంట్లో చట్టాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో ప్రజల్లో ఆవేశాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కూల్చేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు స్టింగ్ ఆపరేషన్ ద్వారా బట్టబయలు అయ్యిందని గుర్తు చేశారు. ఈడీ సీబీఐ దాడులతో దేశంలో అరాచకాలు సృష్టించేందుకు బీజేపీ చేస్తున్నయత్నాలపై సీపీఐ పోరాటాలు చేస్తుందని వివరించారు.