పరిగి, జూన్ 16: పాలమూరు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నీళ్లు తీసుకొచ్చి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల పాదాలు కడిగి రుణం తీర్చుకొంటామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు చెప్పారు. కోర్టుల్లో కేసులు వేస్తూ, భూ సేకరణను అడ్డుకుంటున్నారని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా కరివెన, వట్టెం ప్రాజెక్టుల నుంచి కొడంగల్కు నీళ్లు తీసుకొస్తామని స్పష్టంచేశారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని హరీశ్రావు ప్రారంభించారు. తర్వాత సర్కారు దవాఖానను సందర్శించి, ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఉద్యోగార్థుల కోసం ఏర్పాటుచేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో స్టడీ మెటీరియల్ అందజేశారు. అనంతరం కొడంగల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పరిగి విలేకరుల సమావేశం, కొడంగల్ సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాహుల్గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత జరిగిన ఎన్నికల్లో 97 శాతం ఆ పార్టీ ఓటమి పాలైందని ఎద్దేవాచేశారు.
కాంగ్రెస్ ఖతం, ప్రస్థానం గతమని అభివర్ణించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువని విమర్శించారు. రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నపుడు అభివృద్ధి కొడంగల్ సైతం దాటలేదని, టీఆర్ఎస్ హయాంలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రేవంత్రెడ్డి తెల్లారేసరికే అరచేతిలో వైకుంఠం చూపిస్తారని విమర్శించారు. ఇటీవల వరంగల్ డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ కొత్త ప్రచారానికి దిగిందని, ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఆ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లో రూ.1,400కు క్వింటాల్ చొప్పున వడ్లు కొంటున్నారని, కర్ణాటక రైతులు దొడ్డిదారిన వచ్చి కొడంగల్, తాండూరులో వడ్లను రూ.1,96 0 చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి షాదీముబారక్, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ ఉన్నాయా?అని మంత్రి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని తెలిపారు.
తెలంగాణపై కేంద్రం కక్ష
తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని హరీశ్రావు విమర్శించారు. ఉపాధి హామీ నిధులు ఇవ్వడం లేదని, ఎఫ్ఆర్బీఎం కింద రుణ సమీకరణకు అడ్డుపడుతున్నదని, ఆర్థిక సంఘం నిధులు ఇవ్వనివ్వడం లేదని దుయ్యబట్టారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో నిలిచిందన్నారు.
మూడు నెలల్లో వైద్యుల నియామకాలు
రాష్ట్రంలో అతి త్వరలోనే 10 లక్షల కొత్త పింఛన్లు అందించనున్నట్టు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. అర్హులందరికీ రేషన్కార్డులు అందజేస్తామని చెప్పారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో మూడు డయాలసిస్ సెంటర్లు హైదరాబాద్లోనే ఉండేవని, ఇప్పుడు 100 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,480 సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్నాయని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం వికారాబాద్ మెడికల్ కళాశాల ప్రారంభమయ్యే నాటికి మెడికల్ సీట్ల సంఖ్య 5,240 పెరుగుతుందని పేర్కొన్నారు. పీహెచ్సీలలో వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిందని, వచ్చే పది రోజుల్లో స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు హరీశ్రావు వెల్లడించారు.
వైద్యుల నియామక ప్రక్రియను మూడునెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మొత్తం 13వేల పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రతి గిరిజనతండాలో రూ.25 లక్షలతో పంచాయతీ భవనాలు నిర్మిస్తామని, బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించామని చెప్పారు. త్వరలోనే రోడ్ల పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ రంజిత్రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పీ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, మెతుకు ఆనంద్, చిట్టెం రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, వికారాబాద్ కలెక్టర్ నిఖిల, వికారాబాద్, నారాయణపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్లు మురళీకృష్ణ, శ్యాసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.