పెద్దపల్లి : విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ రాకను అడ్డుకుంటామని వామపక్ష పార్టీలు వెల్లడించాయి. గురువారం సీపీఐ, సీపీఐఎం, సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ, ఎన్ఐపీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని భాస్కరరావు భవన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె. రాజన్న తదితరులు మాట్లాడారు.
ఆర్ఎఫ్సీఎల్లో యూరియా ఉత్పత్తి ప్రారంభమై ఏడాది గడిచిపోయిందని, దానిని పునః ప్రారంభానికి రావడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. భారీ పరిశ్రమలను కార్పొరేట్ సంస్థలకు విక్రయానికి పూనుకున్న కేంద్రంలోని మోదీ సర్కార్ ఎత్తుగడలను తిప్పికొడతామని హెచ్చరించారు.
కేంద్రం ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. మోదీ రాకను వామపక్షాల ఆధ్వర్యంలో అడ్డుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కే.కనకరాజ్ అధ్యక్షత వహించగా సీపీఐఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రామాచారి, ఎన్ఐపీ పార్టీ అధ్యక్షులు జేవి రాజు, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు మధ్యల దినేశ్, తాళ్లపల్లి మల్లయ్య, ఈదునూరి నరేశ్, శనిగరపు చంద్రశేఖర్, మార్కాపూర్ సూర్య , ఎం ఏ గౌస్, ఆరెపల్లి మానస్ కుమార్, విజయ్, ఓదెమ్మ పాల్గొన్నారు.