నల్లగొండ : ఆపదలో ఆదుకునే ఆపద్భాందవుడిగా మంత్రి కేటీఆర్(Minister KTR) అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు. మరోమారు తనకు వచ్చిన ట్వీట్కు స్పందించి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బీఆర్ఎస్ పార్టీ(BRS)కి చెందిన కార్యకర్త కూతురికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. బీఆర్ఎస్కు చెందిన నల్లగొండ (Nallgonda)జిల్లా నాంపల్లి మండలం వడ్డెపల్లి గ్రామం కార్యకర్త నల్లగంటి సుందర్ కుటుంబ సభ్యులు ఈ నెల 20న స్వగ్రామం నుంచి హైదరాబాద్(Hyderabad)కు కారులో బయలు దేరారు.
వీరు ప్రయాణిస్తున్న కారు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పాత మాల్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుందర్ కొడుకు శ్యామ్ (5) అక్కడికక్కడే మృతి చెందగా కూతురు బ్లెస్సీ(3) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హైదరాబాద్లో దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చిన్నారికి దాదాపు రూ.20లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలుపడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
ఈ విషయాన్ని రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, కొనరెడ్డి ఏడుకొండల్ ద్వారా సహాయం కోసం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) కు ట్వీట్(Tweet) చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి కేటీఆర్ చిన్నారి వైద్య ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చినట్లు బ్లెస్సీ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మంత్రి బృందం తమకు ఫొన్ చేసి మాట్లాడినట్లు వారు వెల్లడించారు.