హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ‘ఖబర్దార్ రేవంత్రెడ్డి.. రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ భూముల జోలికి వచ్చినా ఊరుకునేది లేదు’ అంటూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. హైకోర్టు కోసం రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీ భూములను కేటాయిస్తూ సర్కారు ఇచ్చిన జీవో 55ను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం వర్సిటీ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. వ్యవసాయ వర్సిటీకి సంబంధించిన ఒక అంగుళం భూమి కూడా విడిచి పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వ్యవసాయ హబ్గా ఉన్న రాజేంద్రనగర్ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారకేంద్రంగా మార్చడానికి రేవంత్రెడ్డి త్రీవంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉద్యాన యూనివర్సిటీ విద్యార్థులకు బీఆర్ఎస్వీ నిత్యం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ ఉద్యాన యూనివర్సిటీకి భూమి కేటాయిస్తే.. ఈనాటి రేవంత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిని లాకోవాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. వందల ఎకరాల్లో హైకోర్టు నిర్మాణానికి పూనుకోవడంతో వృక్ష జాతులు అంతరించి పోతాయని, జీవజాతులు, అంతకుమించిన వ్యవసాయ పరిశోధనకు నిలయంగా ఉన్న అగ్రి బ యో డైవర్సిటీ పార్కులో జంతుజాలం ఆవా సం కొల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బయోడైవర్సిటీ పార్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వర్సిటీలో సెకండి యర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. ప్రధాన ఆఫీస్కు తాళం వేశారు.
వ్యవసాయ వర్సిటీలోని భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించొద్దని కోరుతూ 25 రోజుల నుంచి ఉద్యమిస్తున్నా.. ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదని వ్యవసాయ వర్సిటీ పీహెచ్డీ విద్యార్థి శ్రీజ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఓ ఫుడ్స్టాల్ పెట్టుకున్న ఆం ధ్రాకు చెందిన కుమారి ఆంటీ విషయంపై సీ ఎం ఒక్క రోజులనే స్పందించారు. మేం ఇంతమంది విద్యార్థులం అల్లాడుతుంటే ఎందుకు స్పందించడం లేదు? మేం ప్రభుత్వ వ్యతిరేకులం కాదు కదా? కాంగ్రెస్ ప్రభుత్వంలోని నాయకులు గత ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు మద్దతుగా అనేక విషయాల్లో పోరాడారు కదా? మరి అధికారంలోకి వచ్చాక పరిష్కారం చూపడం లేదెందుకు?’ అని నిలదీశారు. ‘మా బాధ మీకు అర్థం కావడం లేదా? మా వ్యవసాయ వర్సిటీ దరిదాపులోకి ఏ నిర్మాణాలు రావొద్దు. మా సదువులు మమ్మల్ని సదువుకోనియ్యండి అని మేం అడుగుతున్నాం. మేం రైతాంగానికి సేవలు చేయాలా? వద్దా? ఈ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందా? నిలువదా? మా వ్యవసాయ శాఖ అధికారులు సంతకాలు పెట్టి భూములను ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారనే సమాచారం మాకు తెలిసింది. మేం మాత్రం ఆ ప్రక్రియను సమర్థించం. ఇన్ని రోజులు అధికారుల ప్రమేయం లేకుండానే ప్రభుత్వం జీవో జారీ చేసిందని చెప్పారు. కానీ మా వర్సిటీ అధికారులే సంతకాలు చేసి ఒప్పుకున్నట్టు తెలిసింది. ఇది నిజమా? కాదా?’ అని తెలియాల్సి ఉన్నదని అన్నారు. అది నిజమే అయితే వర్సిటీ అధ్యాపక సిబ్బంది మొత్తం రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో వినయ్, సత్యమూర్తి, విద్యార్థి నేతలు, విద్యార్థలు పాల్గొన్నారు.