దేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లయింది. కానీ సామాన్య ప్రజానీకానికి, రైతాంగానికి వారితో ఒరిగిందేమీ లేదు. ఇప్పటికే నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు తీసుకున్నరు. ఇప్పుడు తెలంగాణ మీద వివక్ష చూపుతున్నరు. రైతులను నట్టేట ముంచడమే పనిగా పెట్టుకున్నరు. రైతులు ఏ పంట పండించినా దానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే. అయినా పంటల కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టడం వ్యవసాయరంగాన్ని దెబ్బతియడమే. ఆరేండ్లలో వరికి రూ. 470 మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం యూరియా, ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలను అంతకన్నా ఎక్కువగా పెంచింది. ఇదంతా రైతాంగాన్ని దోచుకోవడమే. ఇప్పటికైనా కేంద్రం దిగిరాకుంటే, మేమంతా మా ఎంపీలకు
మద్దతుగా కేంద్రంపై ఉద్యమానికి సిద్ధమవుతం.
-సాయన్న, రైతు, అందకూర్, నిర్మల్
ఒక్కటే ప్రశ్న..
తెలంగాణ వడ్లెందుకు కొనరు?
ఒక్కటే సందేహం..
తెలంగాణను ఎందుకిట్లా గోస పెడుతున్నరు?
ఒక్కటే నినాదం..
మద్దతు ధరను చట్టబద్ధం చేయరెందుకు?
ఒక్కటే సూటి మాట..
ధాన్యం సేకరణపై కేంద్రం విధానమేంటి?
ఒక నిలదీత..
అన్నం పెట్టే రైతును శిక్షిస్తారా?
తెలంగాణ రైతుల కోసం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. పట్టు విడువకుండా మూడు రోజులుగా గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. బుధవారం రోజంతా పోడియం దగ్గరే బైఠాయించారు. ఇంత ఆందోళన చేస్తున్నా.. కేంద్రం దున్నపోతుమీద వాన పడినట్టే ఉంటున్నది. లక్షల కుటుంబాలు.. కోట్ల జనాభాకు సంబంధించిన సమస్యపై నిమ్మకు నీరెత్తినట్టు ఉండటమే కాదు.. పొంతనలేని, తప్పుల తడక, ఆషామాషీ జవాబులతో గందరగోళం సృష్టిస్తున్నది. తెలంగాణే కాదు.. దేశవ్యాప్తంగా అన్నదాతల ఆర్తిని తీర్చాల్సిన కేంద్రం.. అసలు దేశంలో రైతులనేవాళ్లున్నారా అన్నట్టు వ్యవహరిస్తున్నది. టీఆర్ఎస్ ఎంపీల అవిశ్రాంత పోరాటానికి సహచర ఎంపీల నుంచి సంపూర్ణ సంఘీభావం వ్యక్తమవుతున్నది. కేంద్ర వ్యవసాయ విధానంలోని డొల్లతనాన్ని టీఆర్ఎస్ ఎంపీలు బట్టబయలుచేస్తున్న తీరును పలువురు విపక్ష ఎంపీలు ప్రశంసిస్తున్నారు. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ వరుస మీడియా సమావేశాల్లో కేంద్రాన్ని, కేంద్ర వ్యవసాయ విధానాన్ని నిగ్గదీసిన తీరును వారు కొనియాడుతున్నారు. ఇప్పుడు జరగాల్సింది ఇదేనని అభిప్రాయపడుతున్నారు.
టీఆర్ఎస్ ఎంపీల పోరాట పటిమపై రాష్ట్రవ్యాప్తంగా పొగడ్తల జల్లు కురుస్తున్నది. రైతులు, రైతు సంఘాల నేతలు టీఆర్ఎస్ ఎంపీల పోరాటంపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఒకవైపు టీఆర్ఎస్ ఎంపీలు రైతుల బాగు కోసం పోరాడుతుంటే.. మన రాష్ట్రం నుంచి ఎన్నికైన, మన రైతులకు ప్రాతినిధ్యం వహించాల్సిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు సహాయనిరాకరణతో.. పీత రాజకీయాలు
చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పార్లమెంటులో కేంద్రప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీల పోరాటం మరింత ఉధృతమైంది. ధాన్యం సేకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కూడా ఉభయసభలను ఎంపీలు స్తంభింపజేశారు. సభ లోపల, వెలుపల తీవ్ర నిరసన తెలిపారు. రైతుల సమస్యలపై కేంద్రం దిగొచ్చేవరకు పోరాటం విరమించేదిలేదని స్పష్టంచేశారు. రైతుల సమస్యలపై బుధవారం కూడా టీఆర్ఎస్ సభ్యులు ఉభయసభల్లో వాయిదా తీర్మానాలిచ్చారు. లోక్సభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నామా నాగేశ్వరరావు నేతృత్వంలో కొత్త ప్రభాకర్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, బీ వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్, బీబీ పాటిల్, రంజిత్రెడ్డి నేలపై కూర్చొని నిరసన తెలిపారు. రైతులను గోసపెట్టొద్దని, ఎంఎస్పీ చట్టం చేయాలని, ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. రైతు సమస్యలపై కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చేదాకా పోరాటాన్ని వీడేది లేదని స్పష్టం చేశారు. దీంతో సభను అరగంటపాటు వాయిదా వేశారు. అయినా టీఆర్ఎస్ ఎంపీలు అక్కడే ఉండి సభ ప్రారంభమైనాక నిరసన కొనసాగించారు.
రాజ్యసభలో 12 మంది సభ్యులను అకారణంగా సస్పెండ్ చేశారని, వారిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని టీఆర్ఎస్ సహా మిగిలిన ప్రతిపక్ష సభ్యులు బుధవారం డిమాండ్చేశారు. సస్పెండైన సభ్యులకు సంఘీభావంగా వాకౌట్ చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనూ కే కేశవరావు, నామా నాగేశ్వర్రావు, సంతోష్కుమార్, కేఆర్ సురేశ్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, లింగయ్య యాదవ్, పీ రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, రంజిత్రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
కేంద్ర మంత్రి పీయూష్గోయల్తో నామా నాగేశ్వరరావు బుధవారం మరోసారి భేటీ అయ్యారు. బియ్యం సేకరణపై కేంద్రం సభలో ఇచ్చిన సమాధానంలో స్పష్టత లేదని, కొంటారా.. లేదా అన్నదాన్ని దాటవేశారని నిరసన తెలిపారు. ‘మీరు యాసంగిలో వరి వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నారు. మీ ఎంపీలు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాత్రం వరి వేయాలని మీడియాలో రైతులకు సూచిస్తున్నారు’ అని అన్నారు. కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీల ప్రకటనలు ఉన్న పత్రికల క్లిప్పింగులను గోయల్కు చూపించారు. అక్కడే ఉన్న కిషన్రెడ్డి కల్పించుకొని వానకాలం పంటకు సంబంధించే తాను చెప్పానని, యాసంగి గురించి మాట్లాడలేదని సంజాయిషీ ఇచ్చుకున్నట్టు తెలిసింది.
తెలంగాణలో ఎంత ధాన్యం సేకరిస్తారో పార్లమెంట్లో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు బుధవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంపీల నిరసనలతో ఉభయసభలను వాయిదా వేసుకొంటూ వెళ్తున్నారేతప్ప సమస్యను పరిష్కరించడంలేదని కేకే ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాతో మాట్లాడారు. వానకాలం పంటను మొత్తం కొనాలని అడిగితే కొంటామని చెప్పారు. యాసంగి గురించి మార్చి నెలలో మాట్లాడుకుందామన్నారు. రైతులు పంటవేసిన తర్వాత కొనుగోలు చేయకుంటే వారు నష్టపోతారని చెప్పాను’ అని తెలిపారు. కేంద్రమంత్రి పీయూష్గోయల్ మొదట ధాన్యం తీసుకుంటామని చెప్పి, తర్వాత మాట మార్చారని విమర్శించారు. ధాన్యం అంశంపై కేరళ, తమిళనాడు, ఒడిశా ఎంపీలతో కలిసి ఉమ్మడిగా నోటీస్ ఇస్తామని చెప్పారు.
రైతుల జీవితాలతో బీజేపీ రాజకీయం చేస్తున్నదని నామా నాగేశ్వర్రావు విమర్శించారు. ధాన్యం కొనుగోలుపై 60 రోజుల నుంచి ఆరుసార్లు కలిసినా కేంద్రంలో చలనం రావడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంట్లో మూడ్రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తుంటే కొందరు నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమతో పాటు గురువారం ధర్నాకు రావాలని బీజేపీ ఎంపీలకు నామా సవాల్ విసిరారు. అప్పుడే బీజేపీని రైతులు నమ్ముతారని అన్నారు. సమావేశంలో ఎంపీలు సంతోష్కుమార్, కేఆర్ సురేశ్రెడ్డి, లింగయ్య యాదవ్, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, రంజిత్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, పీ రాములు, వెంకటేశ్ నేతకాని పాల్గొన్నారు.
తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థలకు 2015-16 నుంచి 2021-22 వరకు రూ.8,587.29 కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పార్లమెంట్కు తెలిపారు. 14, 15వ ఆర్థిక సంఘాల సిఫారసులకు అనుగుణంగా నిధులు కేటాయించినట్టు చెప్పారు. ఇప్పటివరకు రూ.7,589.59 కోట్లు (88.38%) విడుదల చేశామని, ఇందులో రూ.7,219.46 కోట్లు (95.12%) ఖర్చు అయ్యాయని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా తెలిపారు. కాగా, తెలంగాణలో కొత్త కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుచేసే ప్రతిపాదన లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.