హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్లకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని నేషనల్ ఓల్డ్పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్వోపీఆర్యూఎఫ్) జాతీయ అధ్యక్షుడు బీపీ సింగ్ రావత్ అభిప్రాయపడ్డారు. ఈ పార్టీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని, కొత్త పార్టీని ప్రజలంతా స్వాగతిస్తున్నారని ఆయన చెప్పారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలన్న ప్రధాన డిమాండ్తో తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలగాని సంపత్కుమార్ స్వామి, సీనియర్ వైస్ప్రెసిడెంట్ వినోద్ కనోజియాలతో కలిసి ఆయన దేశవ్యాప్తంగా సడక్ యాత్రను నిర్వహిస్తున్నారు. కాశ్మీర్ లాల్చౌక్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన ఈ యాత్ర.. ఇటీవలే హైదరాబాద్కు చేరుకున్నది. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన బీపీ సింగ్ రావత్.. సమకాలీన జాతీయ రాజకీయాలపై స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే..
రావు సాబ్ అచ్చా కామ్ కియా..
కేసీఆర్ సాబ్ దేశంలో ఓ ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చారు. ఇది నిజంగా ఓ చాలెంజింగ్ టాస్క్. ఉద్యోగుల సంక్షేమం రీత్యా థర్డ్పార్టీ అత్యవసరం. దేశ ప్రజలంతా కేసీఆర్ వైపు ఆశగా చూస్తున్నారు. రావు సాబ్.. ప్రజల సంక్షేమం కోసం తెలంగాణలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడి పథకాలు ప్రజలకు ఎంతో మేలుచేసేవి. విద్యుత్తురంగంలో, వ్యవసాయం రంగంలో కేసీఆర్ నిర్ణయాల ఫలితాలను ఈ రోజు దేశం స్పష్టంగా చూస్తున్నది. ఉద్యోగులకు వేతనాలను 76% పెంచారు. అంబేద్కర్ బాట లో సంక్షేమ రాజ్యాన్ని నడుపుతున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని మేం ప్రగాఢంగా నమ్ముతున్నాం.
మా సత్తా ఎంటో చూపుతాం..
కాంగ్రెస్, బీజేపీలు ప్రజల కోసం, ఉద్యోగుల కోసం పనిచేయడం లేదు. పాలసీలను రూపొందించడం లేదు. ఉద్యోగులు, ప్రజలంతా ఇతర దేశాల నుంచి వచ్చిన వారేం కాదు. అంతా ఇక్కడి వారే. ఈ దేశంలో భాగమే. ఒక ఉద్యోగి 10 కుటుంబాలతో సంబంధాలు కలిగి ఉంటారు. ఉద్యోగి అనుకుంటే ఒక గ్రామాన్ని, ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలరు. అయినా కొన్ని ప్రభుత్వాలు మమ్మల్ని పూర్తిగా విస్మరిస్తున్నాయి. ఇలాంటి ప్రభుత్వాలకు మా సత్తా ఏంటో చూపుతాం. 2003లో బీజేపీ ఓల్డ్ పెన్షన్ను రద్దుచేసి.. 2004 కొత్త పెన్షన్ను తీసుకొచ్చింది. కాంగ్రెస్ అదే విధానాన్ని కొనసాగించింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తే ఉద్యోగులందరికీ మేలు జరుగుతుంది. ఆర్థికస్వేచ్ఛ లభిస్తుంది. పాత పెన్షన్ను పునరుద్ధరించాలన్న డిమాండ్తో వందకు పైగా సంస్థలతో నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్వోపీఆర్యూఎఫ్) ఏర్పడి జాతీయస్థాయిలో పనిచేస్తున్నది. ఓపీఎస్ పైనా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే.. అది దేశవ్యాప్తంగా సంచలనమవుతుంది. దేశానికే కొత్త దిశ చూపినట్లవుతుంది. ‘వన్ నేషన్.. వన్ పెన్షన్’ను అమలుచేస్తామని కేసీఆర్ హామీనిస్తే బీఆర్ఎస్ పార్టీకి మేం పూర్తిగా అండగా ఉంటాం. ‘వన్ నేషన్.. వన్ పెన్షన్’ అనే ఒక్కమాట కోసం నాలుగు కోట్ల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కేసీఆర్ నుంచి పిలుపు వస్తే తప్పకుండా వెళ్లి కలుస్తాం. మా సమస్యలపై ఆయనతో చర్చించేందుకు ఆసక్తితో ఉన్నాం.
గుజరాత్లో నల్లచట్టాలు
గుజరాత్, హిమాచల్ రాష్ర్టాల్లో ఎన్నికలున్నాయి. ఈ రాష్ర్టాల్లో ఉద్యోగులంతా బీజేపీ పాలనపై విరక్తితో ఉన్నారు. గుజరాత్ మాడల్ అంతా బూటకం. అక్కడంతా నల్లచట్టాలదే రాజ్యం. ప్రభుత్వ ఉద్యోగులను రోజువారీ కూలీలకన్నా హీనంగా చూస్తున్నారు. 6 ఏండ్లుగా ‘ఫిక్స్డ్ పే’ విధానాన్ని అమలు చేస్తున్నారు. వేతనాలు కూలీల కన్నా తక్కువగా రూ.5 వేలు, రూ.10వేలు మాత్రమే ఇస్తున్నారు. వీటన్నింటినీ నిరసిస్తూ.. సెప్టెంబర్ 21న గుజరాత్లో విధానసభ ముందు ఘెరావ్ కార్యక్రమాన్ని నిర్వహించాం. లక్షలాది ఉద్యోగులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
ప్రజలకు దూరమవుతున్న బీజేపీ..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేవలం పేర్లు మార్చడం, ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మరేమీ చేయడం లేదు. వ్యవసాయ చట్టాలు, విద్యుత్తు బిల్లు విషయంలో ఇదే జరిగింది. హిట్లర్ తరహా నిర్ణయాలను అమలు పరుస్తున్నది. అగ్నివీర్, ఎంబీబీఎస్లో హిందీ వంటివి ఇలాంటివే. అంతర్జాతీయంగా ఇంగ్లిష్ను వినియోగిస్తుంటే.. మనం హిందీని పట్టుకుని వేలాడటం సరికాదు. ఫోన్పే, గూగుల్పే ఇంగ్లిష్లోనే ఉంటాయి. ప్రజలపై ఇప్పుడు కొత్తగా హిందీ వాడకాన్ని రుద్దితే ఏం ప్రయోజనం? వాజపేయి, అద్వానీల నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాలు కూడా ఇలా ఎప్పుడూ వ్యవహరించలేదు. ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలతోనే బీజేపీ క్రమంగా ప్రజలకు దూరమవుతున్నది.