Minister Srinivas Yadav | క్యూ నెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్నివిధాలా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. సోమవారం మంత్రిని వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో క్యూ నెట్ బాధితులు కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన స్వపంలోక్ కాంప్లెక్స్లో కొనసాగుతున్న క్యూ నెట్ అనే సంస్థలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆకర్షణీయమైన ఆదాయం లభిస్తుందని మాయమాటలు చెప్పి తమ వద్ద ఒకొక్కరి నుంచి రూ.లక్షన్నర నుంచి రూ.3 లక్షల వరకు వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన సుమారు 60 మంది వద్ద నుండి వసూలు చేశారని మంత్రికి వివరించారు.
అగ్నిప్రమాదంలో మరణించిన ఆరుగురు సైతం తమ లాగే క్యూ నెట్లో డబ్బులు చెల్లించారని తెలిపారు. తమకు మంచి భవిష్యత్ లభిస్తుందన్న నమ్మకంతో తమ తల్లిదండ్రులు, బంగారం, ఆస్తులు తనఖా పెట్టి డబ్బులు కట్టారని మంత్రికి మొరపెట్టుకున్నారు. స్పందించిన మంత్రి వెంటనే క్యూ నెట్ నిర్వహకులపై తగు చర్యలు తీసుకుంటామని, మీరు చెల్లించిన డబ్బులను మీకు ఇప్పించే విధంగా చూస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
క్యూ నెట్ నిర్వహకులపై వెంటనే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని మహంకాళి పోలీసు అధికారులను ఆదేశించారు. అగ్నిప్రమాదంలో ఎంతో భవిష్యత్ ఉన్న ఆరుగురు మరణించడం చాలా దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం మంజూరైందని, సహాయం మంజూరైందని, త్వరలోనే బాధిత కుటుంబాలకు అందజేస్తామని మంత్రి చెప్పారు.