నల్లగొండ : హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం నేరేడుగొమ్ము, చందంపేట, డిండి, పెద్దవూర మండలాల్లో కలెక్టర్ పర్యటించి బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు, అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవాళి మనుగడ, పర్యావరణ సమతుల్యతకు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ లో, నేరేడుగొమ్ములో బృహత్ పల్లె ప్రకృతి వనంకు భూమి సర్వే, మార్కింగ్ చేసి రెండు రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేయాలని రెవెన్యు డి.టి.కి ఆదేశాలు జారీ చేశారు. స్థలం లెవెల్ చేసి మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలకు సూచించారు.
చందంపేట మండలం కోరుట్లలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు స్థలం పరిశీలించి మొక్కలు నాటి పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. డిండి మండలం ఎర్రరాంలో రహదారి వెంబడి ఆవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించిన కలెక్టర్ మొక్కను నాటి నీరు పోశారు. నాటిన మొక్కలు పెరిగే వరకు సంరక్షించాలన్నారు. పెద్దవూర మండలం నీమానాయక్ తండాలో నర్సరీ సందర్శించి మొక్కలు వివరాలు, గ్రామంలో హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమంపై చర్చించి పలు సూచనలు చేశారు. చలకుర్తి గ్రామపంచాయతీలో రహదారి వెంబడి నాటిన మొక్కలను పరిశీలించారు. కలెక్టర్ పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి, ఆయా మండల, గ్రామ అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు.