జగిత్యాల : గ్రామీణ రోడ్ల నిర్మాణంలో ఇంజనీర్లు, గుత్తేదార్లు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. శనివారం మినీ పద్మనాయక ఫంక్షన్ హాల్లో గ్రామీణ రహదారుల నిర్మాణంలో నూతన సాంకేతికత వినియోగించే విధానంపై నిర్వహించిన వర్క్ షాపులో జిల్లా కలెక్టర్ జి.రవితో కలిసి జడ్పీ చైర్ పర్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంజనీర్లు, గుత్తేదార్లు నూతన సాంకేతికత పట్ల అవగాహన పెంచుకొని, అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు రహదారులు ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రణాళికాబద్దంగా జాతీయ ఉపాధి హమీ నిధులను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాలో రైతు వేదికలు, స్మశానవాటికలు, డంపింగ్ యార్డులు, నర్సరీ, మొక్కల పెంపకం వంటి వాటికి ఉపాథి హమీ నిధులు వినియోగించుకొని, గ్రామాలో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. సీఎం కేసిఆర్ ఆదేశాలతో గ్రామీణ ప్రాంతాలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం కల్పించి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కలుషితం చేసే పదార్థాలను వినియోగిస్తు, పర్యావరణ హితంగా ఇటీవలె పలు రోడ్లు నిర్మించారని, అటువంటి నూతన పద్దతులపై అధ్యయనం చేయాలని సూచించారు. మనం ప్రతి రోజు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని, అప్పుడే మంచి ఫలితాలు అందించగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు నాగం భూమయ్య, బత్తిని అరుణ పంచాయతీరాజ్ ఈఈ రెహ్మాన్, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.