హైదరాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయరంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి ఇబ్బందుల పాలుకాకుండా మా ప్రభుత్వం రైతుబంధు తీసుకొచ్చిందని చెప్పారు. రాత్రిపూట కరెంటు కోసం రైతులు బావులకాడికి పోయి కరెంట్ షాక్తోనో, పాములు కరిచో చనిపోకుండా 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని తెచ్చినమని, ఉచిత విద్యుత్ కోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేసినమని తెలిపారు. ఇవన్నీ నిరర్ధకమని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే విడ్డూరంగా ఉన్నదని అన్నారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే ‘58.29 లక్షల మంది రైతులకు రెండు దఫాలుగా రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం. మొదటి దఫా రూ.16 వేల కోట్లు, రెండో దఫా రూ.14 వేల కోట్ల రుణమాఫీ చేసినం. ఇంకో నాలుగైదు వేల రుణమాఫీ చేయాల్సి ఉండె. కానీ, ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో అవి మాఫీ చేయలేకపోయాం. రాష్ట్రంలో రైతుబంధు పేరుతో 70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లు పెట్టుబడిగా ఇచ్చి వారిలో ధీమా నింపింది బీఆర్ఎస్ ప్రభుత్వం’ అన్నారు.
‘రాష్ట్రంలో 1,11,320 వేల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5,566 కోట్ల రైతుబీమా ఇప్పించినం. రైతు బీమా కోసం రూ.6,861 కోట్లు ప్రీమియంగా చెల్లించినం. దీనిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆ చనిపోయిన రైతులంతా ఆత్మహత్యలు చేసుకున్నరని మాట్లాడిండు. ఇగ దీన్ని ఎట్ల అర్థం చేసుకోవాలో ప్రజలే ఆలోచించాలి. గడిచిన తొమ్మిదేళ్లలో తాము రూ.1,34,768 కోట్ల విలువచేసే 723 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినం. అదేవిధంగా రూ.11,439 కోట్ల విలువ చేసే ఇతర పంటలను (జొన్నలు, మక్కలు తదితర) సేకరించినం’ అని కేటీఆర్ చెప్పారు.
‘రాష్ట్రంలో గిడ్డంగుల సామర్థ్యాన్ని 4 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 24.73 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచినం. రూ.572 కోట్లతో 2,601 రైతు వేదికలు నిర్మించాం. విత్తనాలు, ఎరువులపై రాయితీగా రూ.982 కోట్లు ఇచ్చినం. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.963 కోట్లు ఖర్చు చేసినం. సివిల్ సప్లయ్స్కి రూ.23,604 కోట్లు ఖర్చు పెట్టినం. పంట నష్ట పరిహారంగా రూ.1,794 కోట్లు చెల్లించినం. మైక్రో ఇరిగేషన్ కోసం రూ.2,236 కోట్లు ఖర్చు చేసినం. మేం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు. పదేళ్లలో దాన్ని 2.68 కోట్ల ఎకరాలకు పెంచినం’ అని తెలిపారు.
‘అదేవిధంగా అప్పుడు తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు. పదేళ్లలో అది 350 లక్షల టన్నులకు పెరిగింది. ఇన్ని చేసిన తమపై ఇప్పటి ప్రభుత్వం శ్వేతపత్రం పేరుతో బురదజల్లుతున్నది. పదేళ్లలో పంటతోపాటు రాష్ట్రంలో పాడి కూడా పెరిగింది. మొక్కలు నాటి రెండో హరిత విప్లవం తీసుకొచ్చాం. పాలతో శ్వేత విప్లవం, గొర్రెలతో గులాబీ విప్లవం, చేపలతో నీలి విప్లవం సృష్టించాం. పసుపు ఉత్పత్తిని పెంచి పసుపు విప్లవం తీసుకొచ్చాం. ఇన్ని రకాల సంపద సృష్టిని మీరు (కాంగ్రెస్ ప్రభుత్వం) ప్రస్తావించకుండా శ్వేతపత్రంలో తప్పుడు లెక్కలు చూపించడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.