WE HUB | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప నిర్ణయం తీసుకొన్నది. లైంగికదాడి బాధితులకు మనోధైర్యం, ఆర్థిక సాంత్వనను అందించేందుకు వీహబ్ ద్వారా సహకారం కల్పించేందుకు సిద్ధమైంది. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘భరోసా’ కేంద్రాల ద్వారా ఔత్సాహికులైన బాధితులను ఎంపిక చేసి, వారికి జీవనోపాధి, కొత్త వ్యాపారాలు, ఆంత్రప్రెన్యూర్షిప్పై అవగాహన కల్పిస్తున్నది. ఇటీవల హైదరాబాద్లోని వీహబ్ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి 7 జిల్లాల నుంచి 108 మంది బాధితులు ధైర్యంగా ముందుకొచ్చారు. వీరికి సంబంధిత వ్యాపారాలపై అవగాహన కల్పించారు. రుణాలు తీసుకొనే విధా నం, ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై చర్చించారు. 80 మంది బాధితులతో వీహబ్ మెంటార్లు వ్యక్తిగతంగా మాట్లాడి వారి ఆలోచనలను సానుకూలంగా విని, ఆర్థిక వనరుల గురించి వివరించారు.
ఫుడ్, బ్యూటీ వ్యాపారాలపై ఆసక్తి
బాధిత మహిళల్లో చాలామంది ఫుడ్, బ్యూటీ వ్యాపారాలపై ఆసక్తి చూపినట్టు తెలిసింది. వీరికి వాటిపై అవగాహన కల్పించి, అనంతరం సాయం చేయించాలని వీహబ్ నిర్వాహకులు నిర్ణయించారు. దీంతో వీహబ్, భరోసా కేంద్రాల చొరవను, ప్రభుత్వ కృషిని బాధితులు, వారి తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. ఇలాంటి ఆలోచన అద్భుతమని కితాబిస్తున్నారు.
కుంగిపోకండి.. బయటికిరండి!
లైంగికదాడి బాధితులకు కావాల్సిన సాయం చేసేందుకు తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుం ది. ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న భరోసా కేంద్రాల్లో మీ వ్యాపార ఆలోచన పంచుకోండి. వీహబ్ సహకారంతో మీ వ్యాపార వృద్ధికి కావాల్సిన ప్రోత్సా హం కల్పిస్తాం. ఇంట్లోనే ఉంటూ కుంగిపోకండి. బతకడానికి ఉన్న మార్గాలను అన్వేషించండి. షీటీమ్స్, భరోసా కేంద్రాలు మీకు అండగా ఉంటాయి.
– శిఖాగోయల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ